12-06-2025 09:58:36 PM
తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు: గఫూర్ శిక్షక్..
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): సాహితీ శిఖరం డాక్టర్ సి.నారాయణ రెడ్డి అన్ని సాహితీ ప్రక్రియల్లో తన ప్రతిభను చాటిన మహాకవి అని తెలంగాణ రచయితల వేదిక సంగం(Telangana Writers Forum Sangam) జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. గురువారం కామారెడ్డి కర్షక్ బీఈడీ కళాశాలలో డాక్టర్ సి. నారాయణ రెడ్డి వర్ధంతి సభను నిర్వహించారు. అనంతరం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు, కవులు మాట్లాడుతూ... విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకొని తెలంగాణ ప్రాంత ప్రతిభను ప్రపంచానికి చాటిన గొప్ప సాహితీవేత్త సి. నారాయణ రెడ్డి అని కొనియాడారు.
ఎంతోమంది కవులకు తన సాహిత్యాన్ని ఆదర్శంగా నిలిపారని, సాహిత్యంలోనే కాకుండా సినీ ప్రపంచంలో కూడా తన అక్షరాల జెండాను ఎగురవేసి, గజల్ రంగంలో రారాజుగా నిలిచి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప సాహితీవేత్తగా తెలంగాణ వైభవాన్ని ప్రతిభను తెలిపిన గొప్ప కవిగా నిలిచారని అన్నారు. ఎన్నో పదవులను అలంకరించి, ఆ పదవులకు గొప్పతనాన్ని తీసుకువచ్చిన ప్రతిభ డాక్టర్ సి.నారాయణరెడ్డిది అని అన్నారు. సి.నారాయణ రెడ్డి నివాళి కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రతినిధులు కాశ నరసయ్య, ఎంబారి లింగం, చంద్రకాంత్, కౌడి రవీందర్, నాగభూషణం, బాల రాజయ్య, డిటిఎఫ్ విజయరామరాజు, కిషన్ తదితరులు పాల్గొని సి. నారాయణరెడ్డి రాసిన సినీ గేయాలను, కవితలను పాడి వినిపించారు.