20-06-2025 08:14:40 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న లబ్ధిదారుల్లో మహిళా సంఘాల సభ్యులకు రుణ సహాయం అందించి, వేగవంతంగా ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రాజ్(DRDO Project Director Madhusudan Raj) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ... మహిళా సంఘాల్లో సభ్యులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా లేని పక్షంలో మహిళా సంఘాల ద్వారా రుణం అందజేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి వచ్చే బిల్లుతో రుణం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులు, సౌర విద్యుత్ కేంద్రాలను అప్పగిస్తుందని చెప్పారు.
అలాగే మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలబడడానికి స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలను నెలకొల్పి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి మరియన్న, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, డిపిఎం నళిని, ఏపీఎం రాజీరు తదితరులు పాల్గొన్నారు.