ఆలయ కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించాలి
నల్ల బ్యాడ్జీలతో దేవాలయం ముందు నిరసన
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల(Palvancha Mandal) పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయం(Peddamma Thalli Temple) నూతన కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించాలంటూ కేశవాపురం, జగన్నాధపురం గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దమ్మ తల్లి నీ బిడ్డలకి నువ్వే న్యాయం చేసి ఆదుకోవాలమ్మ అంటూ కేశవాపురానికి చెందిన గంధం నరసింహారావు ఆధ్వర్యంలో దేవస్థానం నూతన కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించలేదంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లి అమ్మవారి గుడిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంధం నరసింహారావు మాట్లాడుతూ కేశవాపురం, జగన్నాధపురం గ్రామస్తులు అనేక ఏళ్లుగా అమ్మవారి సేవలో దేవాలయ అభివృద్ధికి, విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. అలాంటిది ఇప్పుడు నూతన పాలకమండలిలో స్థానికులను విస్మరించి కొత్తవారిని తీసుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి, స్థానికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కొండం పుల్లయ్య,పెద్దయ్య, బానోత్ కుమార్, వీరభద్రం, గంధం సతీష్, లక్ష్మణ్, దేవ, వెంగళరావు, సత్యనారాయణ,రమేష్, ఉదయ్, నాగేష్, కృష్ణ, భాస్కర్, రాము, మహేష్, శ్రీను, జంపన్న, నరసింహ, నాగేశ్వరరావు, లిఖిత్,p సతీష్, స్వరూప, శ్రీరంగ, దేవి, కళ్యాణి, మల్లీశ్వరి సుమ, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.






