8 June, 2026 | 7:45 AM

గీత రచయిత గురుచరణ్ మృతి

13-09-2024 01:09 AM

తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సుప్రసిద్ధ గేయ రచయిత ఆత్రేయ దగ్గర శిష్యరికం చేసిన గురుచరణ్.. పలు సినిమాల కోసం దాదాపు 200ల పైచిలుకు పాటలు రాశారు. గురుచరణ్‌పై నటుడు మోహన్‌బాబుకు ప్రత్యేక అభిమానం. అందుకే తన సినిమాలో ఒక్క పాటైనా గురుచరణ్‌తో రాయించేవారాయన.

‘ముద్దబంతి పువ్వులో మూగబాస లు’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’ వంటి ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ గురుచరణ్ రాసినవే. ఈ ఏ డాది ఫిబ్రవరిలో విడుదలై తెలుగునాట సంచలనం సృష్టించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రంలోనూ గురుచరణ్ ఓ పాట రాశారు. ఈ సినిమాలో ఆయన రాసిన ‘ఏరువాక సాగారో’ పాటది ప్రత్యేక స్థానం. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురపు అప్పారావు, నటి ఎంఆర్ తిలకం దంపతుల కుమారుడైన గురుచరణ్ మరణవార్త తెలిసిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.