23-06-2025 02:23:12 PM
కలెక్టరేట్ ఎదుట మద్దివంచ గ్రామస్తుల నిరసన
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో 200 మంది కూలీలకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయి. కూలి పనులు చేసిన కూలీలకు మస్టర్లు వేయకుండా, ఇక్కడ నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు పనులు చేసినట్లు రికార్డులు చేసి సుమారు రూ.8 లక్షలు అవకతవకలకు పాల్పడ్డట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని, జరిగిన అవకతవకలపై తక్షణం విచారణ జరిపి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకొని, పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... గార్ల మండల ఉపాధి హామీ పర్యవేక్షకులు కొందరు, తమ గ్రామానికి చెందిన మరికొందరు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అమాయకులైన కూలీలకు మీ ఆధార్ కార్డులు అప్డేట్ చేస్తామని నమ్మబలికి వారి చేత వేలిముద్రలు వేయించుకొని డబ్బులు దిగమింగారని దుయ్యబట్టారు. ఈ విషయంపై గార్ల ఎంపీడీవో, ఉపాధి హామీ ఏపీవో లకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని, 20 మంది కూలీలు పనులకు రాకుండానే వారి పేర్ల మీద 8 లక్షల రూపాయలు డ్రా చేసుకున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లిక్తపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన వామపక్ష పార్టీల నాయకులు, కూలీలు పాల్గొన్నారు.