calender_icon.png 23 June, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పింఛన్ చట్టాన్ని రద్దు చేయాలి

23-06-2025 02:26:21 PM

కలెక్టరేట్ ఎదుట పెన్షన్ దారుల నిరసన

మహబూబాబాద్,(విజయక్రాంతి): పాత పెన్షన్ పథకం (ఓపిఎస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పింఛన్ విధానం వల్ల ఇప్పటికే పదవి విరమణ పొందిన ఉద్యోగ వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, పెన్షనర్లను ఏకీకృతంగా ఉంచకుండా, పాత పెన్షనర్లను రెండు విభాగాలుగా విభజించడానికి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారిందని, కొత్త పెన్షన్ చట్టం రద్దుకు సంఘటితంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ నాయకులు అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కొత్త చట్టం ప్రకారం జనవరి 1, 2026 కు ముందు రిటైర్ అయిన పెన్షనర్లు, జనవరి 1, 2026 తర్వాత పెన్షనర్లు రెండు వర్గాలుగా విభజించి, జనవరి 1,2026 తర్వాత పెన్షనర్లకు నూతన పెన్షన్ సంఘం సిఫారసులను వర్తింపజేయవచ్చని చెప్పారు. దీనివల్ల పాత కొత్త పెన్షనర్ల పేరుతో విభజన చేసి పాత పెన్షనర్లకు ఆర్థికంగా నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. కొత్త పెన్షన్ విధానాన్ని సమైక్యంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో పాత పెన్షనర్లకు తీవ్ర అన్యాయం వాటిల్లుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి కలెక్టర్ కు వినతి పత్రం అందించిన చెప్పారు.