04-06-2025 10:58:53 PM
కాంగ్రెస్ నాయకుల తీరుపై బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మల్లికార్జునరెడ్డి ఫైర్..
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు(Gouravelli Project) పనులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటు, అభివృద్ధి అంశాలపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను మరింత పెంచింది. బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి బుధవారం హుస్నాబాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని విస్మరించి, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
సతీశ్ కుమార్ పై విమర్శలు తగవు
మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ గత పదేండ్లలో నియోజకవర్గాన్ని దాదాపు పది వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పథంలో నడిపించారు. అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సమంజసం కాదు," అని మల్లికార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా, నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఏవీ జరగలేదని విమర్శించారు.
గౌరవెల్లి ప్రాజెక్టును ఇంకెప్పుడు పూర్తి చేస్తరు?
నియోజకవర్గ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి, పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తే మంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను వినియోగించుకోవడం లేదు," అని మల్లికార్జునరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అవుతున్నా, గౌరవెల్లి ప్రాజెక్టు పనుల్లో ఎటువంటి పురోగతి లేదని అన్నారు. "నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, పదే పదే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు.
సంతోషమే, కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ప్రాజెక్టు కాలువలకు భూసేకరణ కోసం రూ. 437 కోట్లు మంజూరైనట్లు ప్రకటించినా, ఇంతవరకు భూసేకరణ పూర్తి కాలేదు. పనులు ప్రారంభం కాలేదు," అని విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ఎప్పుడు పూర్తి చేసి రైతులకు నీళ్లిస్తారో కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలా?
నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేశారని, అయితే ఆ కమిటీల్లో ఎవరున్నారో కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని మల్లికార్జునరెడ్డి నిలదీశారు. నిరుద్యోగ యువత కోసం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకంలో కూడా సరియైన ఎంపిక జరగలేదని, అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని, ఈ పథకాన్ని ప్రభుత్వమే కొంతకాలం నిలిపివేసిందన్నారు. "ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల్లో పేదలకు న్యాయం జరిగే విధంగా చూడాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నమ్ముతారు," అని ఆయన హితవు పలికారు.
మంత్రి పర్యటనలు 'మెయిన్ రోడ్డు'కే పరిమితమా?
హుస్నాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ కేవలం మెయిన్ రోడ్డులో తిరిగి కొంతమంది ప్రజలతో మాట్లాడి వెళ్లిపోతున్నారని మల్లికార్జున రెడ్డి విమర్శించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లోకీ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, ప్రజల కష్టాలను స్వయంగా చూడాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు.