30-06-2025 02:51:06 PM
బండరాయితో తలపై కొట్టి చంపిన దుండగులు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్
ఎల్బీనగర్: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిగూడ శివారులో సోమవారం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా మృతుడు కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్ గా గుర్తించారు. అశోక్ యాదవ్ కాచిగూడలో జ్యూస్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తిమ్మాయిగూడ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో అశోక్ యాదవ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, దుండగులు బండరాయితో తలపై కొట్టి అశోక్ను హత్య చేసినట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ద్వారా ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాత కక్షలా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.