22-11-2025 09:56:38 PM
వరి కొయ్యలను కాలుస్తూ మంటల్లో చిక్కుకొని మృత్యువాత
పాపన్నపేట (విజయక్రాంతి): పొలం వద్ద మంటల్లో చిక్కుకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధి పొడిచన్ పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బగుడం నర్సింలు(47) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో భార్యతో కలిసి గ్రామంలో ఉన్న పొలం వద్దకు వెళ్లి పొలంలో వరి కొయ్యలను కాల్చి వేయడానికి మంట పెట్టారు. ఆ మంట వీరి పొలంతో పాటు పక్క పొలంలోకి వెళ్లడంతో మంటను ఆర్పేందుకు వెళ్లాడు.
కాలు సరిగ్గా లేక నడవలేని పరిస్థితి ఉండడంతో మంటలు ఆర్పుతూ అదే మంటల్లో చిక్కుకున్నాడు. దీంతో తల, శరీరానికి మంటలు అంటుకొని తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాసేపటికి భార్య సులోచన గమనించి స్థానికులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.