జవహర్నగర్ లో వ్యక్తి అదృశ్యం
కేసు నమోదు చేసిన పోలీసులు
జవహర్ నగర్, జూన్ 4 (విజయక్రాంతి): జవహర్ నగర్ బాలాజీ నగర్ లోని స్థానిక మదర్ తెరిసా కాలనీకి చెందిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. జవహర్నగర్ ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం మదర్ తెరిసా కాలనీలో నివాసం ఉంటున్న రాజు (28) అనే వ్యక్తి, తన భార్య కీర్తిక ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ఫుడ్ బిజినెస్ (ఆహార వ్యాపారం) చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
ఈనెల 1వ తేదీన రాజు పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అయితే, రాత్రి అయినా అతడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినప్పటికీ రాజు ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళనకు గురైన రాజు భార్య కీర్తిక.. వెంటనే జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో భర్త అదృశ్యంపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్హెచ్ఓ సైదులు వెల్లడించారు.






