06-12-2025 08:09:25 PM
అయ్యప్ప మాల, దుస్తులు తీయించిన వైనం..
యూనిఫామ్ వేయించి అనుమతి..
ఘట్ కేసర్ (విజయక్రాంతి): అయ్యప్ప మాలధారణలో పరీక్షా కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని స్వామి దుస్తులు తొలగించి యూనిఫాంలో కాలేజీ యజమాన్యం అనుమతించింది. ఈ సంఘటన జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్ పరిధిలోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. యాదగిరిగుట్టకు చెందిన చందు నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం అయ్యప్ప మాల ధరించి కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చాడు. కాలేజీ స్టాఫ్ మాల దుస్తులు తీసి యూనిఫాం ధరించి రావాలని ఆదేశించారు.
అయినా వినకపోవడంతో బలవంతంగా అయ్యప్ప మాల దుస్తులు తీయించి యూనిఫాం వేయించినట్లు బాధితుడు చందు ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. విద్యార్థి పట్ల అవమానకరంగా వ్యవహరించారని శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో కళాశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పవన్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం, లెక్చరర్ విద్యార్థి వేసుకున్న అయ్యప్ప మాల, దుస్తులను తీయించి కళాశాల యూనిఫామ్ వేయించి అవమానించారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గడ్డాలు పెంచి, టోపీలు పెట్టుకొని తిరుగుతున్న ఇతర మతస్తులని ఏమి చేయలేని యాజమాన్యం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులకు క్షమాపణలు చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, నాయకులు బస్వ రాజుగౌడ్, గొంగళ్ళ బాలేష్, ప్రభంజన్ గౌడ్, అయ్యప్ప మాలదారులు తదితరులు పాల్గొన్నారు.