దోమల నివారణకు చర్యలు చేపట్టాలి
జోనల్ కమిషనర్ సత్యనారాయణ
మలక్పేట్, ఆగస్టు 27 (విజయక్రాంతి): దోమలను ఆరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జీ హెచ్ యం సీ చార్మినార్ జోనల్ కమిషనర్ కన్నం సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. చార్మినార్ జోన్ పరిధిలో ఎంటమాలజీ విభాగం చేపడుతున్న కార్యకలాపాలపై జోనల్ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గురువారం ఉదయం జోనల్ కార్యాలయంలో ఎంటమాలజీ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దోమల నివారణ చర్యలకు చేపడుతున్న కార్యక్రమాలు, యాంటీ లార్వా ఆపరేషన్, పాగింగ్ నిర్వహణపై అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ... జోన్ పరిధిలోని అన్ని సర్కిళ్లల్లో యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ఫాగింగ్ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
నీటి నిల్వలు, మురుగు కాలువలు, ఖాళీ ప్రదేశాలు ఉండే ప్రాంతాలను నిరంతరం పరిశీలించి దోమల ఉత్పత్తికి అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఎంటమాలజీ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్ ఎంటమాలజీ విభాగం ఎస్ఈ నామాల శ్రీనివాస్, ఏ ఎం హెచ్ ఓ లు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రుద్ర శ్రీనివాస్, డాక్టర్ శైలీ, సూపర్వేసార్లు, పాల్గొన్నారు






