గాంధీభవన్లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం
పాల్గొన్న ఆసిఫాబాద్ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్లోని గాంధీభవన్లో బుధవారం రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన “చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్”లోని ప్రతి అంశాన్ని అమలు చేయాలని కోరారు.
ముఖ్యంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ఆయన నేతల దృష్టికి తీసుకెళ్లారు. అటవీ భూముల సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ట్రైకార్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడారు. ఆదివాసీల సమస్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.




