01-06-2025 12:00:00 AM
అమెరికాకు తమ పిల్లల్ని పంపాలంటే తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత అక్కడి యూనివర్సిటీలపై, విదేశీ విద్యార్థులపై ఆంక్షలకు తెర లేపారు. అమెరికాకు తమ పిల్లల్ని పంపించి నిజంగానే మంచివిద్యను అందించాలనుకొనే తల్లిదండ్రులు ఉన్నారు.
మన సమాజంలో, ఎంత ఖర్చయినా సరే పిల్లల్ని అమెరికా పంపి తమ స్టేటస్ పెంపుగా భావిస్తున్న తల్లిదండ్రులూ ఉన్నారు. ఆసియా దేశాల నుంచి 1960 దశకంలో అనేక విద్యావంతులు అమెరికాకు వెళ్లారు. మన దేశం నుంచి కూడా అమెరికాకు అప్పుడు అవ సరమైన శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు, డాక్టర్లు వలస వెళ్లారు. అక్కడ పీ
హెచ్డీలు పూర్తి చేసి తమ రంగాల్లో రాణించారు. మన దేశానికి ఎంతో పేరు తెచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ ఐటీ కంపెనీలకు సీఈఓలుగా మనవాళ్లు ఎదిగినట్టుగానే అప్పుడు వివిధ రంగాల్లో మనవాళ్లు ప్రఖ్యాతి గడించారు. విభిన్నమైన ఆలోచనలకు కేంద్ర బిందువుగా అమెరికా విశ్వవిద్యాలయాలు పేరు తెచ్చుకున్నాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక, వైజ్ఞానిక రంగాల్లో పలువురు
మేధావులను అక్కడి యూనివర్సిటీలు అందించాయి. మన దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఎదుట అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న మన దేశ విద్యార్థులు కొందరు నిరసన తెలిపారు. భారత కాన్సులేట్ అధికారులకు ఇది కోపం తెప్పించింది. నిరసన తెలిపిన ఆ విద్యార్థుల పేర్లు ఇవ్వాల్సిందిగా యూనివర్సిటీని అడిగారు. అయితే, నిరసన తెలపడం వారి హక్కు, వారి పేర్లను ఇచ్చేది లేదని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇది గత కాలం ముచ్చట. ఇప్పుడు ట్రంప్ సర్కారులో అలాంటి విద్యార్థుల వీసాలు రద్దు కావచ్చు.
అమెరికాకు వలస వస్తున్న విద్యార్థులు వీసా పొందే సమయంలోనే ఇప్పుడు తమ ‘కాండాక్టు సర్టిఫికెట్’ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వారి భావజాలాన్ని నిశితంగా పరిశీలించడం జరుగుతుంది. అమెరికా యూనివర్సిటీల్లోని మన దేశ విద్యార్థులు ఇప్పటికే తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగించుకొని ఉంటారు. కొత్తగా అమెరికాకు వెళ్లాలనుకొనే విద్యార్థులు ఇక రాజకీయ నిరసన ప్రదర్శనల్లో పాల్గొని వున్నా, అక్కడ క్లాసులు ఎగ్గొట్టినా వీసాలకు ముప్పే. ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న.
ఈ ధోరణిని అక్కడి కోర్టులు తప్పు పడుతున్నా, ఇది మన దేశంలో పిల్లల్ని అమెరికాకు పంపించాలని కలలు గన్న తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నది. అమెరికాలో డాలర్ డ్రీమ్స్ ఇక అంత సులభం కాదని విద్యార్థులూ కలత చెందుతున్నారు.
ఎలాగోలా వీసా సంపాదించినా అమెరికాలో ఇక మన బతుకు దుర్భరమేనని సాధారణ అభిప్రాయం మన విద్యార్థుల్లో కలుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు ప్రతి ఏటా మన దేశం నుంచి అమెరికాలో చదువుల కోసం వెళుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో అక్కడి షరతులు, నిబంధనలను గమనిస్తే గాని అమెరికాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది తేలుతుంది.