01-06-2025 12:00:00 AM
జలం జీవనం, జలం సర్వప్రాణినాం ఉద్భవితే
జలమే సర్వస్య ములం, జలమే సర్వమయం చ॥
అని నీటి ప్రాముఖ్యతను తెలియచేస్తుంది ఈ శ్లోకం. మానవాళి మొత్తం నదుల వెంటనే నాగరికత, నగరాలూ వెలసి, ఒక నూతన ప్రపంచానికి పునాది వేసింది నదులు మాత్రమే. భారతదేశానికి పేరు వచ్చింది కూడా సింధు (ఇండస్) నదితోనే. ఇండియాకు గుర్తింపు కూడా ‘ఇండస్’ నది ద్వారానే అని అర్థమవుతుంది. మన జాతీయగీతంలోనూ స్పష్టంగా ‘పంజాబ్ సింధు గుజరాత మరాఠా, వింధ్య హిమాచల యమునా గంగా’ అని పాడతాం. ఈ జాతీయగీతం మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది.
సిన్ధుః జీవనదా శుభా,
వహతి శక్తిమయం జలం
పావనీ పుణ్యదా నిత్యం,
రక్షతు భారతం సదా॥
అంటే సింధుజలాలు శక్తి సంపన్నమైనవి. అవి సదా భారత్ను రక్షిస్తాయనీ అర్థం. పూర్వకాలంలో సింధునది పరాయి ఆక్రమణదారులకు ఒక జలరక్షణ కవచం లాగా ఉండేది.
సింధునదికి ప్రధానంగా 6 ఉపనదులు (ఇండస్, చీనాబ్, ఝలుమ్, రవి, బియాస్, సట్లెజ్) ఉండగా, ఇది భారత్ హిమాలయాలలో మొదలై, భారత్లోని లడక్, జమ్మూ, కశ్మీర్, హిమాచల్, పంజాబ్ మీదుగా పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్, పాకిస్థాన్లోని పంజాబ్, తర్వాత సింద్ ప్రాంతంలో ప్రవహించి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతమే సింధూలోయ నాగరికతకు, భారతదేశ పునాదికి మూలం.
నది సామర్థ్యం:
“త్వం సిన్ధో సరస్వతీ కుబేర ఇవ వాజినీ
అస్మే ధేహి శ్రవో బృహత్॥
ఋగ్వేదం, 10వ మండలం
(సింధు, సరస్వతీ నదులు కుబేరుని అంతటి సంపద్వంతమైనవి. వాటి ద్వారా మాకు గొప్ప ఖ్యాతిని, శౌర్యాన్ని ప్రసాదించుగాక.)
ప్రతి ఏడాది హిమాలయాల నుంచి సింధునది ద్వారా దాదాపు 6700 (టీఎంసీ) జలాలు ప్రవహిస్తాయి. అందులో దాదాపు 75% భారత్, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉత్పన్నం అవుతున్నాయి. పాకిస్థాన్లో కేవలం 20-% అదికూడా కేవలం ఋతుపవనాల ఆధారిత వర్షాధార నీరు మాత్రమే. ఉదా॥కు మొత్తం గోదావరి, కృష్ణా నదుల నీటి ప్రవాహం కేవలం 6000 టీఎంసీ నీళ్లు మాత్రమే.
నదీజలాల ఒప్పందం:
1) 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత ప్రధాని నెహ్రు, పాకిస్థాన్ అధ్యక్షుడు ఫెయిల్ మార్షల్ అయూబ్ ఖాన్ కరాచీలో ఒప్పందం చేసుకున్నారు.
2) దీని ప్రకారం భారతదేశానికి 15%, పాకిస్థాన్కు 85% నీళ్ల వాటా లభించింది.
3) తూర్పు నదులైన రవి, బయాస్, సట్లెజ్ భారత్కు, పడమరన ఉన్న ఇండస్, చీనాబ్, ఝలుమ్ పాకిస్తాన్ దేశానికి..
4) భారత పడమర నదుల జలాలను కేవలం విద్యుచ్ఛక్తికి మాత్రమే ఉపయోగించాలి.
5) భారతదేశం తూర్పు నదులను వాడుకోకుండా 10 సంవత్సరాలు పాకిస్థాన్కు ఆటంకం లేకుండా నీళ్లు ఇవ్వాలి.
6) పాకిస్థాన్లో సింధూ నదిమీద ప్రాజెక్టులు, బ్యారేజీలు, కాల్వలు కట్టుకోవడానికి భారతదేశం 62 మిలియన్ పౌండ్స్ విరాళంగా ఇవ్వాలి.
7) రెండు దేశాల మీద ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ ఒప్పందం కొనసాగాలి.
8) పాకిస్థాన్ అనుమతి లేకుండా ఇండియా సింధూ మీద ఎలాంటి ప్రాజెక్టు కట్టగూడదు.
విస్మయం కలిగించే విషయం:
అప్పటికే 1) 1948లో పాకిస్థాన్, పాకిస్థాన్ ప్రేరేపిత ట్రైబల్ ఆర్మీ కొంత జమ్మూ, కశ్మీరు, గిల్గిట్ బాల్తిస్తాన్ ఆక్రమించుకున్నాయి.
2) సమస్య ఐక్యరాజ్యసమితిలో జటిలం.
3) ఇండియా సింధూ పరీవాహక ప్రాంతంలోని పై భాగానే ఉంది కనుక, పాకిస్థాన్ భారత్మీద ఆధారపడి ఉంది. అవసరం పాకిస్థాన్ది, ఇండియాది కాదు.
4) ముందుచూపు లేకుండా 75% పరీవాహక ప్రాంతం భారత్లో ఉన్నా, 85% హక్కు పాకిస్థాన్కు కల్పించడం హాస్యాస్పదం.
5) అప్పుడు భారతదేశమే సంక్లిష్ట పరిస్థితులలో ఉన్న ఆ రోజులలో 62 మిలియన్ పౌండ్లు పాకిస్థాన్కు సింధూ నదిమీద (పాకిస్థాన్లో) ప్రాజెక్టులు కట్టుకోవడానికి విరాళంగా ఇచ్చిన ఘనత మన జవహర్ లాల్ నెహ్రుది. ఉదా॥కు 62 మిలియన్ పౌండ్లకు 1960లో 154.42 మెట్రిక్ టన్నుల బంగారం వచ్చేది (అప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం బంగారం నిల్వ కేవలం 200- మెట్రిక్ టన్నులు మాత్రమే).
ఇప్పటి విలువ ప్రకారం గ్రాముకు 9606 అంటే 1,46,899.75 కోట్లు (1.46 లక్షల కోట్లు) మన నెహ్రు పాకిస్థాన్కు విరాళం ఇచ్చారు. దీనిని మొత్తం 10 విడతలలో చెల్లించారు. నెహ్రూది ఎంత మంచి దాతృత్వం అంటే 1965లో పాకిస్థాన్ ఆపరేషన్ గిల్బట్లర్- ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో భారతదేశంపై యుద్ధానికి దిగినా కూడా నెహ్రు పాకిస్థాన్కు ఇచ్చే విరాళం ఆపలేదు.
పాకిస్థాన్పై ప్రభావం:
90% వ్యవసాయం, 5.2 కోట్ల ఎకరాలకు సాగునీరు (గోధుమ, వరి, పత్తి, చెరుకు), టెక్స్టైల్ పరిశ్రమ(60% ఎగుమతుల వాటా), సిమెంట్, ఎరువుల తయారీ, 7000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, జీడీపీలో 30% వాటా, మత్స్య సంపద, 15 కోట్ల మందికి తాగునీరు సరఫరా, భూగర్భ జలాల పెంపు. ఒక విధంగా చెప్పాలంటే మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు, పాకిస్థాన్ ఆయువు పట్టు సింధునదిలో ఉందంటే అతిశయోక్తి కాదు.
భారతదేశంపై ప్రభావం:
1) 2.3 కోట్ల ఎకరాలకు పంజాబ్, హిమాచల్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్లకు నీటి సరఫరా, 4300 మెగావాట్ల హైడ్రో పవర్ ఉత్పత్తి. ఇది కేవలం సింధూనదిపైన 15% మాత్రమే భారత్ తమ హక్కులను వాడుకుంటుంది.
వారధి కాగలదా?
సింధూనది జలాలు భారత్ పాకిస్థాన్ల మధ్య సంధికి వారధిగా దోహద పడవచ్చా? సింధు జలాలు చాల శక్తివంతమైనవి. అందులో దాదాపు 50,000 మెగావాట్ల పవర్ దాగి ఉంది. అందుకే ఈ నది గురించి ఋగ్వేదంలో
నదీనాం శ్రేష్ఠా సింధురే
గర్జతే ఇంద్రవత్ శుభా
సరస్వతీమపి త్యజ్య
సింధుం వందే మహాజలమ్॥
”ఈ నది అత్యంత శ్రేష్ఠమైంది. ఇంద్రుడిలా యుద్ధంలో గర్జిస్తోంది. సరస్వతికంటే తేజోవంతమైంది. ఈ మహత్తరమైన నదికి నేను నమస్కరిస్తున్నాను” అందుకే, సింధునది జలాలు సంధికి శ్రీకృష్ణరాయబారానికి మించిన జలఖడ్గం కాగలదు.
‘భారత్ సింధు అబియాన్’
సింధునదిపై భారత్ ‘భారత్ సింధు అబియాన్’ మొదలుపెట్టాలి.
1) భారత్ సింధు జలాల పూర్తి వినియోగానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు మొదలుపెట్టాలి. వియన్నా కన్వెన్షన్ ఆన్ ట్రీటీస్ (ఆర్టికల్ 60) ప్రకారం సింధూ రద్దు లేదా పునఃపరిశీలన చేసే అధికారం భారత్కు ఉంది.
2) ఇరిగేషన్, జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణం. వెంటనే చీనాబ్, ఇండస్, ఝలుమ్ నదులపై భుర్సార్ డ్యామ్, ఉర్జ్ మల్టీ పర్పస్ డ్యామ్, సవాల్కోట్, జిస్పా, పాకాల కేట్, రాట్ల, కిరు డ్యాముల నిర్మాణం, సింధూనదిపై శయోక్, నుబ్రా గ్లాసియల్ కాంట్రల్ డ్యామ్ నిర్మించి, నూతనంగా జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో 2.5 కోట్ల ఎకరాల సాగునీటికి శ్రీకారం చుట్టాలి. ప్రధానంగా ఇంటర్ బేసిన్ లింక్ క్యానల్స్, టన్నెల్స్ అవసరం.
3) జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణం: అత్యల్ప ఖర్చుతో సింధు జలాలనుంచి దాదాపు 20,000 అదనపు మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయవచ్చు. దానికిగాను రాట్ల, పాకుల్, కిరు, కీర్తయి, బూర్సుర్, క్వార్, సవాల్ కేట్, దుంకర్, తమాషా ప్రాజెక్టులను పూర్తి చేయాలి.
4) ఖర్చు ఎంత? అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయటానికి దాదాపు 2.5 లక్షల కోట్ల ఖర్చవుతుంది. భారత్ పాకిస్థాన్తో ఒక నెల యుద్ధం చేస్తే ప్రత్యక్ష, పరోక్ష ఖర్చు దాదాపు 5 లక్షల కోట్లు అయ్యేది.
పాకిస్థాన్లో తలెత్తే సమస్యలు:
1) 90% పాకిస్థాన్ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, తాగునీరు సింధూనది మీద ఆధారపడి ఉన్నందున తీవ్రమైన సాగు, తాగునీటి సమస్య ఉత్పన్నం కావచ్చు.
2) పాకిస్థాన్లోని పంజాబ్, సింధు ప్రాంతం నీటి ఎద్దడికి లోనై ప్రాంతాల మధ్య పోరాటాలు మొదలవుతాయి.
3) 90% పాకిస్థాన్ సైన్యం పంజాబ్ ప్రాంతం వారు కాబట్టి సైన్యం మీద పూర్తి వ్యతిరేకత మొదలవుతుంది.
4) పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి పోతుంది.
5) అనివార్యంగా పాకిస్థాన్ భారత్దేశాన్ని సంధికోసం ప్రాధేయ పడవలసి వస్తుంది.
సంధికి మార్గాలు ఇవీ:
1) పాక్ ఆక్రమిత కశ్మీరును భారత్లో శాంతియుతంగా కలపటం లేదా పాకిస్థాన్ భారత్లో విలీనానికి అంగీకరించడం.
2) ముఖ్యమైన టెర్రరిస్టులను భారత్కు అప్పగించడం, పాక్ ఆక్రమిత కశ్మీరును భారత్లో కలపడం.
3) పాకిస్థాన్లో పంజాబ్, సింధ్, బలోచిస్తాన్, నార్త్ వెస్ట్ ఫ్రంట్ నీటిమధ్య విభేదాలు, పాకిస్థాన్ నాలుగు ముక్కలుగా విడిపోవడం.
4) పాకిస్థాన్లోని అణ్వస్త్రాలను అంతర్జాతీయ అణుసంస్థకు అప్పగించడం లేదా పాకిస్థాన్ దుస్సాహసం చేస్తే ఆపరేషన్ సిందూర్ పూర్తి స్థాయిలో అమలు చేయడం.
ఇందులో కచ్చితంగా సింధు నదిజలాలు సంధికి లేదా పాకిస్థాన్ అనే శిశుపాల సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుంది. అది అమ్రిత్ కాల్, 2047, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 100 సంవత్సరాలకు లేదా అంతకు ముందు జరి గే అవకాశం ఉంది. దానికి ప్రధానంగా భారత్ ఆర్థికంగా ఇంకా బలపడాలి. అందుకు 140 కోట్ల భారత ప్రజలు ‘అఖండ భారత్’ స్థాపనకు సింధునది జలశక్తిని సద్వినియోగం చేసుకోవాలి.
వ్యాసకర్త మాజీ ఎంపీ, బోనగిరి