31-05-2025 12:00:00 AM
అంతర్జాతీయ స్థాయిలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడంతో తెలంగాణ నూతన అధ్యాయానికి నాంది పలికినట్లయింది. ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అత్యం త అద్భుతంగా నిర్వహించింది. అదే విధం గా ఏప్రిల్లో పెట్టుబడులను ఆకర్షించేందు కు అంతర్జాతీయ స్థాయిలో భారత్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోనే ఘనంగా నిర్వహించింది.
రెండు రోజులుపాటు సాగిన ఈ సదస్సులో దాదాపు వం ద దేశాలనుంచి 400 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే 25 ఏళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడింది. వివిధ దేశాలకు చెందిన పారిశ్రా మికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే లా ఈ అంతర్జాతీయ సదస్సు ప్రయోజనకరంగా మారింది. ‘భారత్ సమ్మిట్’ విజయ వంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో ప్రశంసలందుకుంది.
ఈ నేపథ్యంలోనే మన రాష్ట్ర ప్రభుత్వానికి మరో అపూర్వ అవకాశంగా ‘మిస్ వరల్డ్’ పోటీల నిర్వహణ చారిత్రాత్మకమైంది. ‘మిస్ వరల్డ్’ పోటీల నేపథ్యంలో ప్రపంచ సుందరీమణులు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా కట్టుబొట్టు, చీరకట్టును పాటించడం విశేషం. మన ఆలయాలు, ప్రముఖ పర్యాటక క్షేత్రాల సందర్శనతో వాటి ప్రాముఖ్యత, చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సందర్భంగా ఒక సరికొత్త రికార్డు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం ప్రపంచ సుందరీమణుల హృదయాలను ఆకట్టుకుంది. ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదాన్ని తమ దేశాల్లో వినిపిస్తామని సుందరీమణులు పేర్కొన్నారు.
ఆదరణ, ఆత్మీయతలకు ఫిదా
‘మిస్ వరల్డ్’ పోటీలు రాష్ట్రానికి పెట్టుబడుల పరంగా పర్యాటక రంగంలో మంచి గుర్తింపు రావడానికి ఒక మైలురాయి అయినాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యం, అధికారుల ఏర్పాట్లు, ఇక్కడి వెరైటీ వంటకాల రుచులు తమను ఎంతో ఆకట్టుకున్నాయని సుందరీమణులు ఆనందం వ్యక్తం చేశారు. వీరంతా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయలు, సంపద, సాంప్రదాయ కళలు, చారిత్రక కట్టడాల వైభవాలను కళ్లారా చూసి మంత్ర ముగ్ధులయ్యారు.
చార్మినార్ నుంచి యు నెస్కో వారసత్వ గౌరవం పొందిన రామప్ప ఆలయం వరకు, పేరిణి నృత్య లయబద్ధత నుంచి పోచంపల్లి చీరల కళాత్మకత వరకు, హైదరాబాదీ బిర్యానీ రుచులనుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు తెలంగాణ ప్రజా జీవితంలో భాగమైన ప్రతీ అంశం వారిని ఫిదా చేసింది. ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదం బాగా హిట్ అయ్యింది.
రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను మరింతగా పెం పొందిస్తూ రాష్ట్రాన్ని ఒక అద్భుత గమ్యస్థానంగా నిలపడంలో ఈ కార్యక్రమం చక్కగా దోహదప డింది. ‘మిస్ వరల్డ్’ పోటీల సందర్భంగా ప్రతీ అంశంలోనూ తెలంగాణ పేరు ప్రముఖంగా ప్రతిబింబించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
సంప్రదాయ పూర్వక స్వాగతాలు
ఈ కార్యక్రమం తెలంగాణను ప్రపంచ దృష్టిలో విశేషంగా నిలిపింది. ఈ వేడుకలు, రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కావడం మరో విశేషం. ఈ సందర్భంగా, తెలంగాణ యునెస్కో వారసత్వ స్థలాలు, అధునాతన వైద్య సౌకర్యాలు, మెడికల్ టూరిజం, సాంస్కృతిక వైవిధ్యం వంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా మరోమారు గుర్తింపులోకి వచ్చాయి.
మే 2 నుంచి 8 వరకు ప్రపంచం నలుమూలల నుంచి సుందరీమణులు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. కెనడా నుంచి ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్, బ్రెజిల్ నుంచి జెస్సికా స్కాండియుజ్జి పెడ్రోసో, పోర్చుగల్ నుంచి మరియా అమేలియా బాప్టిస్టా, ఐర్లాండ్ నుంచి జాస్మిన్ గెర్హార్డ్ వంటి సుందరీమణులకు తెలంగాణ సాంప్రదాయ పూర్వక పద్ధతిలో హారతులిచ్చి, తిలకాలు దిద్ది మరీ కళాకారులు, అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ రకంగా దేశంలోని సాంస్కృతిక, చారిత్రక సంపదల సమ్మేళనంగా వెలుగొందుతు న్న తెలంగాణ 72వ ‘మిస్ వరల్డ్’ పోటీలకు రూపొందించిన వేదిక అనేక ప్రత్యేకతలతో ద్విగుణీకృతమైంది. ఈ అంతర్జాతీయ కార్యక్రమం హైదరాబాద్లో జరగడం, ప్రపంచ సుందరీమణులు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాలను సందర్శిస్తూ, మనవైన సాంస్కృతిక సంప్రదాయాలను తెలుసుకోవడం ద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ మరింత వెలుగొందింది.
అడుగడుగునా మంత్రముగ్ధత
ఈ నెల 7న గచ్చిబౌలిలో ‘మిస్ వరల్డ్ పోటీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై లాంఛనంగా ప్రారంభించారు. మిస్ వరల్డ్- 2025 పోటీల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, పాశ్చా త్య దేశాలకు చెందిన కొన్ని కళలనుకూడా ప్రదర్శించారు. పలువురు కళాకారులతో తెలంగాణ రాష్ట్ర గేయాలాపనతో కార్యక్రమం అత్యంత ఉత్తేజకరంగా ప్రారంభ మైంది. 250 మంది కళాకారులతో ప్రదర్శించిన పేరిణి నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
ప్రారంభ సమావేశంలో లాటిన్ అమెరికా దేశాల పోటీదారులు తమ ఆహార్యంతోపా టు ఆయా దేశాల సంస్కృతి, సంప్రదా య వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సుందరీమణులు తెలంగాణ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలను సందర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో భాగంగా వారు హైదరాబాద్, వరంగల్, ములుగు వంటి ప్రాంతాల్లోని చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలను సందర్శించి, తెలంగాణ సంప్రదాయాలను ఆస్వాదించారు.
ప్రపంచ సుందరీమణులు రాష్ట్రంలోని పురాతన ఆలయాల శిల్ప వైభవాన్ని, సాం స్కృతిక ప్రాముఖ్యతలను తెలుసుకొని అబ్బురపడ్డారు. పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్లో 22 మంది ప్రపంచ సుందరీ మణులు అంతర్జాతీయ శాంతికి నెలవైన బుద్ధవనాన్ని చూసి ఆనందపరవశులయ్యా రు.
ధ్యానమందిరంలోకి వెళ్లి ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. బుద్ధవనంలోని అతిపెద్ద ధ్యానమందిరం, గౌతముని జీవిత చరిత్రను తెలిపే విగ్రహాలు వారిని బాగా ఆకట్టుకున్నాయి. వరంగల్ కాకతీయ సామ్రా జ్య శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే వేయిస్తంభాల ఆలయం అయితే వారిని మంత్రముగ్ధులను చేసింది.
గుర్తుండిపోయే పర్యటన
మొత్తం 35 మంది సుందరీమణుల బృందం వరంగల్ ఆలయంలోని శిల్పకళా సౌందర్యాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను తెలుసుకు న్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ములుగు రామ ప్ప ఆలయం నాటి కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి చిహ్నం. ఇక్కడి శిల్పకళకు వా రంతా ఫిదా అయ్యారు. ఇక, పేరిణి నృత్య ప్రదర్శన మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరంగల్ కోట గొప్ప చరిత్రను తెలుసుకున్నారు.
భక్తి, ఆధ్యాత్మికతలకు కేంద్రంగా విలసిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సుందరీమణుల హృదయాలను బాగా ఆకర్షించింది. హైదరాబాద్ ప్రపంచ చిహ్నంగా గుర్తింపు పొందిన చార్మినార్ను సందర్శించి హెరిటేజ్ వాక్ నిర్వ హించారు. లాడ్ బజార్లో గాజులు, అలంకరణ వస్తువులను కొనుగోలు చేశారు. 1591లో నిర్మితమైన చార్మినార్ స్మారక చిహ్నం, హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబింపజేసింది.
చౌమహల్లా ప్యాలెస్ నిజాం రాజవంశీయుల గొప్పతనాన్ని ప్రదర్శించింది. ఇక్కడ ప్రభుత్వ విందు ను వారు మనసారా ఆస్వాదించారు. ఘు మఘుమలాడే హైదరాబాద్ ప్రత్యేక వంటకాలను రుచి చూశారు. హైదరాబాద్ ఆతి థ్యం, తెలంగాణ ప్రజాదరణ తమను మైమరిపించిందని, ఈ పర్యటనను జీవింతాంతం గుర్తుంచుకుంటామని వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని శిల్పారామాన్ని మహిళా శిశు సంక్షే మ శాఖమంత్రి సీతక్కతో కలిసి వారు సందర్శించారు. తెలంగాణ సంప్రదాయ కళలు, చేనేత వస్త్రాలను యువతులంతా ఆస్వాదించారు. ట్యాంక్బండ్, సచివాలయం, ఏఐజీ ఆసుపత్రి వంటి ప్రదేశాలనూ వారు ఉత్సాహంతో సందర్శించారు. మెడికల్ టూరిజం డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నారు.
వ్యాసకర్త సమాచార, పౌరసంబంధాల శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్, కరీంనగర్ సెల్: 9676647807