07-02-2026 06:36:53 PM
తిర్యాణి,(విజయక్రాంతి): బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తున్న తిర్యాణి మండల విద్యాధికారి (ఎంఈవో) అంజయ్యను వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని ఆదివాసీ ఉద్యోగ, సంక్షేమ, సాంస్కృతిక సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్నాక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కుమ్రంభీం చౌరస్తాలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
అత్యవసర పరిస్థితుల్లో క్యాజువల్ లీవ్ (సీఎల్) మంజూరులో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కొందరిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు, బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఎంఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిర్యాణి మండలంలో విద్యా వ్యవస్థ గాడితప్పిందన్నారు. ఎంఈవోను విధుల నుంచి తొలగించి సమర్థుడైన అధికారిని నియమించాలని, లేనిపక్షంలో శాంతియుత ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.