క్యాంటీన్లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి
సిరిధాన్య వంటకాల ప్రోత్సాహం – క్యాంటీన్లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి: కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్ ద్వారా తయారవుతున్న ఆహార పదార్థాల వివరాలను నిర్వహణ సిబ్బందిని అడిగి తెలుసుకున్న కలెక్టర్, కార్యాలయాలకు విచ్చేసే ఉద్యోగులు, ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా సిరిధాన్యాలు (మిల్లెట్స్)తో తయారుచేసిన ఇడ్లీ, దోశ వంటి ఆరోగ్యకరమైన వంటకాలను క్యాంటీన్లో అందుబాటులోకి తేవాలని సూచించారు. క్యాంటీన్ నిర్వహణ విధానంపై వివరాలు సేకరించి, ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారో తెలుసుకున్నారు. క్యాంటీన్లో నాణ్యమైన, తాజా ఆహార పదార్థాలనే విక్రయించాలని, శుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని నిర్వాహకులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ పర్యటన సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ సందర్శించారు. మహిళా సంఘాల ద్వారా తయారుచేసిన వివిధ ఆహార పదార్థాలను రుచి చూసి, మహిళల స్వయం ఉపాధి అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనినా సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




