30-06-2025 02:04:57 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, అగ్నిమాపక డీజీ జీవీ నారాయణతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు."సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని ఒక రసాయన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించాలని ఆదేశించారు". అని ఎక్స్ లో పోస్టు చేశారు.
సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒడిశా, ఇతర రాష్టాలకు కార్మికులు రసాయన కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం. పాశమైలారం ప్రమాద స్థలంలో ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉందని, అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నామని మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ప్రమాదసమయంలో కంపెనీలో 150మంది ఉన్నారని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 90 మంది ఉన్నారని మల్టీజోన్ ఐజీ వెల్లడించారు. సిగాచి పరిశ్రమలో గాయపడిని బాధితుల్లో 36 మంది కార్మికులు వివిద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పేలుడు ప్రభావంతో కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.