కేసీఆర్ ఊరుకున్నా.. మేము ఊరుకోం: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: పథకం ప్రకారం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబంపై కక్షసాధింపు జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(BRS MLA Jagadish Reddy) ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ కు ఏం సంబంధం?, ఏ విచారణ అధికారైనా కేసీఆర్, కేటీఆర్ పేరు చెప్పారా?, ఫోన్ ట్యాప్ చేశారని ఏ అమ్మాయైనా ఫిర్యాదు చేశారా? అని జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఊహించి రాసి ఇదే జర్నలిజం అంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఆధారాలు లేకుండా రాస్తే మా చర్యలు కఠినంగా ఉంటాయని, దుష్ప్రాచారంపై కేసీఆర్ ఊరుకున్నా మేము ఊరుకోమని జగదీశ్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరగడం లేదా? ఇప్పుడు ట్యాపింగ్ జరగట్లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం అని కొంత సేపు, ఫోన్ ట్యాపింగ్ అని ఇంకొంత సేపు సీరియళ్ల సిరీస్ నడుపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ - బీజేపీ పాలిత రాష్ట్రాల్లో(Congress-BJP) ఎన్నో బ్రిడ్జిలు కూలుతున్నా ఏ ఒక్కడూ మాట్లాడరు! మీరు ఏలుతున్న రాష్ట్రాల్లో ఎన్ని జరిగినయ్ తీద్దామా లెక్క? ఇష్టమొచ్చినట్టు విషం చిమ్మి ఇదే జర్నలిజం అంటే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి( Jagadish Reddy) తేల్చిచెప్పారు. ఒక్కొక్కరు సత్యహరిశ్చంద్రునికి అన్నలుగా ఫోజు కొడుతున్నరన్న ఆయన డెక్కన్ క్రానికల్, సాక్షిలపై టీడీపీ, జనసేన దాడులు చేయలేదా? మహా న్యూస్ పై దాడి జరిగిందని ఎవరికీ తెలియక ముందే చంద్రబాబు నాయుడు స్పందించారు.. దీన్ని బట్టి చంద్రబాబు ప్రణాళిక ఏంటో అర్థమవుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.






