అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి సువర్ణ వనమాలకు మంథని లో ఘన నివాళి
అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,(విజయ క్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి శ్రీమతి సువర్ణ వనమాల (91) వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ సందర్భంగా మంథని లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దివంగత సువర్ణ వనమాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజానీకం, కుటుంబ సభ్యులు పాల్గొని సువర్ణ వనమాలకు కన్నీరుమున్నీరుగా వీడ్కోలు పలికారు. సువర్ణ వనమాల మరణం దుద్దిళ్ల కుటుంబానికే కాకుండా మంథని ప్రాంతానికి తీరని లోటని పలువురు నాయకులు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.






