‘డబుల్ ఇంజిన్’ అంటే పేపర్ల లీకేజీయేనా?
కేంద్రం అసమర్థతకు ’నీట్’ కుంభకోణమే నిదర్శనం
కూసుమంచి మండలం జీళ్లచెరువు క్లస్టర్ ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి గర్జన
కూసుమంచి, మే 13 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన అసమర్థతతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి చేయడం కాదు.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల గొంతు కోయడమేనా? అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువులో నిర్వహించిన ’ప్రజా దర్బార్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కేంద్రానిది కళ్లుండి చూడలేని తనం!
నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరీక్షకు 42 గంటల ముందే పేపర్లు బయటకు రావడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది మన రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థులు ఈ కుంభకోణం వల్ల రోడ్డున పడ్డారని అవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మాత్రం ఏమీ ఎరుగనట్లు నాటకమాడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నాడు దొరల పాలనలోనూ..
తెలంగాణలో గత పదేళ్ల ‘దొరల పాలన’లో జరిగిన అన్యాయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు అన్ని పేపర్లూ లీక్ అయ్యాయన్నారు. ఆనాటి ప్రభుత్వ మంత్రుల పీఏలే జిరాక్స్ సెంటర్లలో పేపర్లు అమ్మారని ఆరోపించారు. ఆనాడు ఇంటర్ ఫలితాల తారుమారు వల్ల 28 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే నియామక సంస్థలను ప్రక్షాళన చేసి, పారదర్శకంగా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
ప్రజా దర్బార్లో అర్జీల వెల్లువ
జీళ్ళచెరువు క్లస్టర్ పరిధిలోని 13 గ్రామ పంచాయతీల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి మంత్రి పొంగులేటి జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూ సమస్యలపై వచ్చిన వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. న్యాయమైన ప్రతి సమస్యను 100 శాతం పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.






