తల్లికున్న సత్సంస్కారమే బిడ్డ పాలిట వరం
కొత్తపల్లి,(విజయక్రాంతి): శిశువు పరిపూర్ణ వికాసానికి కావలసిన బీజం తల్లి గర్భంలో ఉన్నప్పుడే పడాలని, తల్లికున్న సత్సంస్కారమే బిడ్డ పాలిట వరం అవుతుందని డాక్టర్ ఎడవల్లి శైలజ అన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం, కరీంనగర్ శివానంద హాస్పిటల్ డాక్టర్ ఎడవల్లి శైలజ సంయుక్త నిర్వహణలో ఆర్య జనని పేరున బుధవారం కరీంనగర్లోని వైశ్యభవన్లో గర్భిణి స్త్రీలకు ఉచిత అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ తల్లి ఆలోచనలు, చేసే పనులు, మాట్లాడే మాటలు, మానసిక స్థితి అన్ని కూడా శిశువును ప్రభావితం చేస్తాయన్నారు. శిశువు ఈ ప్రపంచంలోకి రాకముందు ఉన్న పరిస్దితులే తరువాత శిశువు వ్యక్తిత్వాన్ని, గుణసంపదను నిర్ణయిస్తాయన్నారు.
తల్లిలోని నకారాత్మక భావాలు, ఆందోళన శిశువు శారీరక, మానసిక ఆరోగ్యంపై వ్యతికేక ప్రభావం చూపుతాయన్నారు. ఈ వ్యతిరిక్తత తొలగించుకోవడానికి తల్లి మధురమైన, మార్ధవమైన సంగీతాన్ని వినాలని, సమతుల ఆహారం, యోగాసనాలు «శరీరాన్ని చక్కగా ఉంచుతాయన్నారు. సంస్కారవంతులైన, దైవం పట్ల భక్తిశ్రద్దలు కలిగిన తల్లులు ఉన్న ఇండ్లలోనే ఉన్నతమైన వ్యక్తులు జన్మిస్తారన్నారు. బిడ్డ పుట్టుకతోనే సంస్కార సిరిని, జ్ఞానసంపదను అందిపుచ్చుకునేలా చేయగలిగితే జీవితం సాఫీగా సాగుతుందన్నారు. శిశువు మహోన్నత వ్యక్తి కావాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంస్కారం అందాలన్నారు. విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి, కార్యక్రమ ఆర్య జనని సృష్టికర్త స్వామి శితికంఠానంద మహారాజ్ మాట్లాడుతూ బిడ్డను కనబోతున్న స్త్రీ ఉత్తమమైన తల్లిగా రూపుదిద్దుకొని గర్భంలో ఉన్న శిశువు సర్వ సద్గుణ సంపన్నులుగా పుట్టేటట్లు చేయడానికి సహాయాన్నిఅందించడమే అర్యజనని ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
ఆర్యజనని ట్రస్ట్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అనుపమ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తల్లి మనోశరీరాలపై వ్యతిరిక్త ప్రభావాలు కలిగించే విధంగా పరిసరాలు, ఆహారం, కుటుంబ వ్యవస్ధ ఉంటే అవన్నీ గర్భస్థ సమయంలో పిండం మీద ప్రభావం చూపి బిడ్డ ఎదుగుదలకు ఆటంకాలౌతాయన్నారు. తల్లి యొక్క భక్తి విశ్వాసాలపైనే శిశువుకు సంక్రమించే సంస్కారం ఆధారపడి ఉంటుందని ఆ సంస్కారం శిశువు పూర్ణవికాసానికి దోహదపడుతుందన్నారు. ఈ సదస్సులో సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డాక్టర్ ఎడవల్లివిజయేంద్ర రెడ్డి, జిల్లా మహిళ సంక్షేమాధికారి ఎం.సరస్వతి , గర్భిణీ స్త్రీలు మరియు మహిళలు పాల్గొన్నారు.






