5 May, 2026 | 9:55 PM

అర్హతే ప్రామాణికం.. మూడు నెలల్లో పరిష్కారం!

05-05-2026 08:52 PM

- ప్రజా దర్బార్‌ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభయం

- సాదాబైనామాలకు 35 రోజుల్లోనే మోక్షం.. అక్రమాలకు తావులేదు

ఖమ్మం,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుకు మూడు నెలల్లోపు పరిష్కారం చూపుతామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, బాధితుల నుంచి స్వయంగా విన్నపాలను స్వీకరించారు.

భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ

గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తెచ్చిన తంటాలతో రైతులు పడుతున్న ఇబ్బందులను తాము 'భూ భారతి' ద్వారా తొలగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా సాదాబైనామా దరఖాస్తులను అర్హత మేరకు రాబోయే 35 రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అయితే, సాదాబైనామా పేరుతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, అటువంటి దరఖాస్తులను తిరస్కరిస్తామని గట్టిగా హెచ్చరించారు.

- ప్రజల ముంగిటకే పాలన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు, మహిళలు, నిరుద్యోగ యువత పక్షాన ప్రభుత్వం నిలబడుతుందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు నిర్వహించిన 7 క్లస్టర్ల పరిధిలో వచ్చిన పది వేల దరఖాస్తులలో 5 వేల వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసమే రావడం ప్రజల అవసరాన్ని సూచిస్తోందని, వీటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల తొలగింపు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్ , వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.