21-06-2025 01:20:57 PM
అన్ని వర్గాల సంక్షేమానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట.
పినపాక నియోజకవర్గ పర్యటనలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఆనాటి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ప్రభుత్వం పదేళ్లల్లో చేయనివి ఇందిరమ్మ ప్రభుత్వం(Indiramma Government) పదినెలల్లో చేసి చూపిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(Collector Jitesh V. Patil), ఐటిడిఎ పీఓ రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లతో కలిసి గుండాల మండలం జగ్గుతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మామకన్నులో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. విప్పలగుంపులో పీఆర్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఆళ్లపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల(Indiramma house) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి(Minister Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ... పేద ప్రజల కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. దీనిలో భాగంగా పినపాక గిరిజన నియోజకవర్గం కావడంతో 1000 అదనపు ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు.
రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు దశలవారీగా ప్రతి సోమవారం నిధులను విడుదల చేయడం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో పదేళ్లల్లో రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేయగా, ప్రస్తుత ప్రభుత్వం 10 నెలల్లోనే రూ. 21 వేల కోట్ల రూపాయలను రైతులకు మాఫీ చేసి చూపిందన్నారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు నిధులను జమ చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో అర్హుల అందరి ఖాతాల్లో నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, రూ. 500 కే గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పేదల సంక్షేమానికి పెద్దపీట ఇందిరమ్మ ప్రభుత్వం వేస్తుందని అన్నారు. 40 శాతం మెస్ ఛార్జీలు, 200 శాతం కాస్మొటిక్ ఛార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ తరుపున నిలబడే అభ్యర్థులను దీవించాలని స్థానిక ప్రజలను కోరారు.