21-06-2025 01:24:20 PM
వ్య కా స జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు
పెన్ పహాడ్: రైతాంగానికి ఎకరాకు 12 వేల రూపాయలు ఇచ్చారని మరి భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు(General Secretary Matti Pelli Saidulu) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు. శనివారం పెన్ పహాడ్ మండల పరిధిలోని మాచారంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూమిలేని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12వేల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరా అవుతున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేసిన పాపాన పోలేదన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. భూభారతిలో అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ సర్వేను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. దళిత, గిరిజన పేదలకు ఇంటి నిర్మాణానికి ఏడు లక్షలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు కొత్త పింఛన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..అలాగే వికలాంగుల సర్టిఫికెట్ కోసం స్లాట్ బుక్ కాకా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుంజ వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొండమీది రాములు తదితరులు పాల్గొన్నారు.