19-06-2025 05:56:42 PM
మహిళలు ఆర్థిక స్వావలంబన చెందాలి..
జగ్గన్నపేట గ్రామంలో కుట్టుమిషన్ శిక్షణ ముగింపు..
కుట్టు మిషన్లు, ధ్రువపత్రాల పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క..
ములుగు (విజయక్రాంతి): మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Danasari Anasuya Seethakka) అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కుట్టు మిషన్ ఉచిత శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్, ధ్రువపత్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... చాలా మంది నైపుణ్యం లేని కారణంగా ఉపాధికి దూరంగా ఉంటున్నారని, దూర ప్రాంతాలకు పనికోసం వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనుతిరిగి వస్తున్నారని, ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మహిళలు ఉన్నదగ్గరనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో వారికి ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినదని అన్నారు. వివిధ పాఠశాలల్లో అవసరమైన మేరకు ఏకరూప దుస్తులను మహిళా సంఘాలకు ఆర్డర్ ఇచ్చి వారి ద్వారా విధ్యార్థులకు బట్టలు కుట్టించడం ద్వారా మహిళా సంఘాలకు దాదాపు 30కోట్ల రూపాయల లాభం వారికి చేకూర్చడం జరిగినదని తెలిపారు.
భవిష్యత్తులో రాబోయే విద్యాసంస్థలలోని పిల్లలకు కూడా మహిళా సంఘాల ద్వారానే బట్టలు కుట్టేలా వారికి ఆర్డర్ లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 15 సం.ల నుండి 60 సం.ల లోపు వయస్సున్న మహిళలు అందరూ తప్పకుండా మహిళా సంఘాలలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ లు,ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు,బస్సులు,సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవకాశాలను అందించడం జరుగుతుందని అన్నారు. మహిళలు ప్రభుత్వ సహకారాన్ని వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని, తద్వారా తెలంగాణ ప్రగతి పథంలో నడిచేలా మనమంతా ముందడుగు వేద్దామని అభిలషించారు.