13-11-2025 12:21:19 PM
రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం
అడవి సోమనపల్లిలో 40 ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి, (విజయక్రాంతి): పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. బుధవారం రాత్రి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామంలో పూర్తయిన 40 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పేద ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మొదటి దఫా లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రూ.3500 చొప్పున మొత్తం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పేదలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రతి సోమవారం డబ్బులు విడుదల చేస్తున్నామని, జిల్లాలో మంథని నియోజకవర్గం పరిధిలో నేడు గృహ ప్రవేశాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
పేద ప్రజల ముఖాలలో సంతోషం చూస్తే తనకు చాలా సంతృప్తి కలుగుతుందని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల లోపు మరో మూడు విడతలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, సోమనపల్లి వద్ద రూ.200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా గురుకుల పాఠశాల పనులు జరుగుతున్నాయని, గత ప్రభుత్వంలో రైతులు తాళ్ళ కట్టింగ్ తో ఇబ్బందులు పడితే మన ప్రజా ప్రభుత్వం కట్టింగ్ కు స్వస్తి పలికి సన్నరకం వడ్లకు క్వింటాళ్ల రూ. 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. రూ. 25 లక్షల 65 వేల మంది రైతులకు 20 వేల 681 కోట్ల రూపాయల 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసామని, వానాకాలం పంటలో సన్న రకం పండించిన ధాన్యానికి రూ. 1800 కోట్ల బోనస్ అందించామని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలి అనే అంశం పై రైతులకు శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో 40 గృహ ప్రవేశాలు మంత్రి చేతుల మీదుగా జరపడం సంతోషకరమని అన్నారు.
అడవి సోమనపల్లిలో సబ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన
అడవి సోమనపల్లి గ్రామంలో రూ. 3 కోట్ల 5 లక్షలతో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పిడి హౌసింగ్ రాజేశ్వరరావు, మంథని ఆర్డీఓ సురేష్ , తాసీల్దార్ కుమార్ స్వామి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.