29 May, 2026 | 8:21 PM

రాష్ట్రంలో 95 శాతం ధాన్యం కొనుగోలు చేశాం: మంత్రి శ్రీధర్ బాబు

29-05-2026 12:31 PM
  1. చివరి గింజ వరకు రైతుల ధాన్యం కొనుగోలు చేస్తాం 
  2. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలి 
  3. మంథని వ్యవసాయ మార్కెట్ యార్డు పరిశీలనలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు 

మంథని,మే29(విజయక్రాంతి): రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి 95 శాతం ధాన్యం కొనుగోలు(Grain Procurement) చేశామని, చివరి గింజ వరకు రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని  మంథని వ్యవసాయ మార్కెట్ యార్డు(Manthani Agricultural Market Yard)  పరిశీలనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని, రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని 95శాతం ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి తెలిపారు.

అయినప్పటికీ అక్కడ అక్కడ మిగిలి ఉన్న దాన్ని చూపుతూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) రాజకీయ లబ్ధి పొందాలని తాతకలాడుతున్నారన్నారు. రైతులను తప్పుదారి పట్టించేందుకు బిజెపి నాయకులు(BJP Leaders) రాష్ట్రంలో పర్యటిస్తూ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని, అక్కడ అక్కడ మిగిలి ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. మంత్రి వెంట మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,  ముత్తారం మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.