ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
మంత్రి పొంగులేటితో కలిసి ధాన్యం కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్
కూసుమంచి,(విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. గురువారం పాలేరులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఈ సీజన్లో రూ. 22 వేల కోట్లతో 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యమని వెల్లడించారు. హమాలీల కొరత ఉన్నప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని, వచ్చే 15 రోజుల పాటు లారీలను కేవలం ధాన్యం రవాణాకే కేటాయించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.






