calender_icon.png 18 June, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ: మంత్రి ఉత్తమ్

18-06-2025 07:29:42 PM

హైదరాబాద్: పోలవరం-బనకచర్ల విషయంలో విభజన చట్టాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రీ ఫీజబులిటీ రిపోర్టు ఇచ్చిందని, ఆ రిపోర్టుపై స్పందించాలని కేంద్రం తమను అడిగితే తాము పూర్తిస్థాయి నివేదికను సమర్పిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అభ్యంతరాలను తెలుపుతామన్నారు. 

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని, గోదావరి-బనకచర్లను పరిశీలించడం రాష్ట్ర హక్కులను కాలరాయడమే అని నీటిపారుదల మంత్రి వెల్లడించారు. పోలవరం-బనకచర్లను తిరస్కరించాలని కేంద్రానికి స్పష్టంగా చెప్పామని, గోదావరి ట్రైబ్యునల్ అవార్డును బనకచర్ల ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందని తెలిపారు. తెలంగాణకు అనుకూలమైన ఇచ్ఛంపల్లిని ఏపీ వ్యతిరేకించిందని, అత్యవసరంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరామని ఉత్తమ్ వివరించారు. తెలంగాణ వాటా 968 టీఎంసీలలో కట్టుకునే ప్రాజెక్టులనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు గోదావరి అవార్డుకు వ్యతిరేకించిందన్నారు. 

బనకచర్ల వల్ల మన వాటా జలాలకు కూడా భవిష్యత్ లో ఎదురుదెబ్బ అని, పూర్తయిన ప్రాజెక్టులకు అధిక కేటాయింపులను ఏపీ భవిష్యత్ లో అడుగుతుందని, ఈ ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను కేంద్రానికి జనవరి 22న చెప్పినట్లు ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్రానికి ఏపీ నుంచి డీపీఆర్ అందలేదని, గోదావరి-బనకచర్లపై ముందుకెళ్లవద్దని జల్ శక్తి మంత్రికి మార్చి 3న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రేపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని బృందం కలవనుంది.