మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరి
రోడ్డు ప్రమాద బాధితులకు స్వయంగా సహాయం
షాద్నగర్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే పరమావధిగా మంత్రి వాకిటి శ్రీహరి ఉదారతను చాటుకున్నారు. గురువారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై పాల్మాకుల వద్ద జరిగిన ఘోర బైకు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.మక్తల్ పర్యటనకు వెళ్తున్న మంత్రి, ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్ను నిలిపివేశారు. రక్తపు మడుగులో, భీతావహంగా ఉన్న మృతదేహాలను చూసి వెనకడుగు వేయకుండా, తన సిబ్బందితో కలిసి మంత్రి స్వయంగా వాటిని పక్కకు తొలగించారు.
వెంటనే అంబులెన్స్ను పిలిపించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ, ప్రోటోకాల్ కంటే ప్రాణానికే విలువిచ్చిన మంత్రి తీరుపై ప్రయాణికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ప్రజా ప్రతినిధి అంటే కేవలం హోదా మాత్రమే కాదు, బాధ్యత కూడా" అని ఆయన నిరూపించారని పలువురు కొనియాడారు.




