1 March, 2026 | 3:45 PM

హేమాచలుడిని దర్శించుకున్న మంత్రులు

01-03-2026 11:59 AM

ములుగు జిల్లా,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని  ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క ), మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం, పినపాక శాసన సభ సభ్యులు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు  దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు, ఉద్యోగులు పూర్ణకుంభంతో, డోలు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు.

స్వామి వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ ( సీతక్క), ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు తదితరుల గోత్ర నామాలతో గర్భాలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు అందించి ఆశ్వీరవచనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, ఎస్ పి సుధీర్ రామనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సిహెచ్ మహేందర్ జి, ఈ ఓ మహేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.