calender_icon.png 1 November, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తున్నాం

31-10-2025 10:41:31 PM

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ వెల్లడి

నిజామాబాద్,(విజయక్రాంతి): అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వంపరంగా కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో  సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  శుక్రవారం ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు.

తుపాను ప్రభావం వల్ల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం నిల్వలను పరిశీలించారు.  తడిసిన ధాన్యం తరలింపులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు.   రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, వాటి తరలింపు, రైతులకు బిల్లుల చెల్లింపులు తదితర వివరాల గురించి ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులను కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొని ఉన్న పరిస్థితి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే వివరాలతో కూడిన ట్రక్ షీట్ రిపోర్ట్ ను పరిశీలించారు. తడిసిన ధాన్యం విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతోందని ఈ సందర్భంగా రైతులకు భరోసా కల్పించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆకాల వర్షానికి తడిసినట్టు అంచనా వేశామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టిన ఫలితంగా చాలా వరకు నష్టాన్ని నివారించగలిగిందని అన్నారు. అయినప్పటికీ అక్కడక్కడా ఆరబెట్టిన ధాన్యం నిల్వలు అకాల వర్షానికి తడిసాయని, వీటిని ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లిస్తూ సేకరిస్తోందని తెలిపారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు.

అధికారులు అందరూ పరస్పర సమన్వయంతో కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించేలా సమిష్టిగా కృషి చేస్తున్నారని, కేంద్రాలలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఫలితంగా ఇప్పటికే లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యిందని తెలిపారు. కాగా, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కాపాడుకునేందుకు రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు టార్పాలిన్ లు పంపిణీ చేశారు. వీరి వెంట నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గోపి,  తహశీల్దార్ వెంకట్ రావు, ఎంపిడీఓ అనంత్ రావు, స్ధానిక అధికారులు, రైతులు  ఉన్నారు. కాగా, గన్నారం శివారులో నిర్మాణ దశలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాలను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు వీటిని యధాస్థితిలో కేటాయిస్తూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరయ్యే నిధులతో నిర్మాణాలు పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు.