07-09-2025 10:06:39 AM
గుమ్మడిదలలో మిలాద్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
గుమ్మడిదల, (విజయక్రాంతి): ఐదు సంవత్సరాలుగా మిలాద్ ఉన్ నబీ పర్వదినం పురస్కరించుకొని వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో రక్తదానంపై చైతన్యం పెంపొందించడం అభినందనీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మిలాద్ ఉన్ నబి పర్వదినం పురస్కరించుకొని.. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ప్రైవేటు ఫంక్షన్ హాలులో వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మిలాద్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆదివారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాలలో కన్నా రక్తదానం మహా గొప్పదని అన్నారు. ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. రక్తదానం విశిష్టతను ప్రచారం చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. రక్తదానంతో పాటు వివిధ సమాజసేవ కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. రక్తదానం ద్వారా మనిషి శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, సిఐ నయీముద్దీన్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.