సీఐడీ విచారణకు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి
- భార్య శాలినిరెడ్డితో సహా హాజరు
- నాలుగు గంటల పాటు అధికారుల విచారణ
- తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): జనవరిలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. శనివారం హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో కౌశిక్రెడ్డి అధికారు లు విచారించారు. కౌశిక్రెడ్డితోపాటు ఆయన భార్య శాలినిరెడ్డికి కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే భార్య కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు.
ఎమ్మెల్యేను సీఐడీ డీఎస్పీ రంగస్వామి విచారించారు. జనవరి 29న సమక్క - సారలమ్మ జాతర సందర్భంగా హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ, పోలీసుల విధుల్లో అడ్డంకి, దూషణలు, మతవిద్వేష వ్యాఖ్యలు చేసినట్టు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయగా.. విచారణకు రావాల్సిందిగా కౌశిక్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
దాదాపు నాలుగు గంటల పాటు అధికారులు విచారణ జరిపారు. విచారణను వీడియో రికార్డు చేశారు. సీఐడీ విచారణ అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల పేరుతో ఇబ్బందులు పె డితే భయపడేది లేదని, నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు.
మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అప్పుడు కేసులు తిరగబడతాయని హెచ్చ రించారు. నా నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ నిర్మాణంపై నిరసన చేపడతామని అనుకున్నానని, నన్ను హుజురాబాద్ వెళ్లనివ్వకుండా నోటీసులు ఇచ్చి కావాలనే విచారణకు పిలిచారని ఆరోపించారు. నాతో పాటు నా సతీమణికి సీఐడీ అధికారులు ఎందుకు నోటీసులు ఇచ్చారో అర్థం కావడం లేదని తెలిపారు.




