18-06-2025 12:17:42 AM
కననాస్కిస్, జూన్ 17: నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మంగళవారం కెనడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. 2015 తర్వాత మోదీ కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ కననాస్కిస్ వేదికగా జరుగుతున్న 51వ జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు. కెనడా ప్రధాని మెక్ కార్నీతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సహా వివిదే దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ఏఐతో అనుసంధానం, క్వాంటమ్ సంబంధిత అంశాలపై చర్చించారు. 2019 నుంచి జీ-7 సమావేశాలకు మోదీ వరుసగా హాజరవుతూ వస్తున్నారు. కెనడా పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో బుధవారం మోదీ క్రొయేషియాకు వెళ్లనున్నారు.
ఖలీస్థానీల కుట్ర..
2023లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు తెగిపోయాయి. తాజాగా కెనడాలో మోదీ పర్యటన సందర్భంగా ఆందోళనలు చేపట్టేందుకు ఖలిస్థానీలు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఖలిస్థానీ మద్దతు దారులు అల్బెర్టాలోని కననాస్కిస్ వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు కాల్గరేలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.