దాడి చేయడం తప్పే.. నా పరిస్థితి.. సందర్భాన్ని అర్థం చేసుకోవాలి
హైదరాబాద్,(విజయక్రాంతి): మీడియా ప్రతినిధిపై దాడి ఘటనపై సినీ నటుడు మంచు మోహన్ బాబు గురువారం స్పందించారు. 11 నిమిషాల ఆడియో ప్రకటన విడుదల చేశారు. తను జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని ఆవేదన వ్యక్తి చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేవాళ్లు జర్నలిస్టులా కాదా అనేది ఆయనకు తెలియదన్నారు. మీడియాను అడ్డుపెట్టుకొని తనపై దాడి జరగొచ్చని ఆలోచించనన్నారు. జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నా అని, మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు బాధపడుతున్నానని మోహన్ బాబు చెప్పారు. దెబ్బ తగిలిన జర్నలిస్టు తనకు తమ్ముడులాంటి వాడని, అతని భార్యాబిడ్డల గురించి ఆలోచించానన్నారు. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా.? ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలని కోరారు. ఇలా మీడియాపై దాడి చేస్తానని ఎప్పుడూ ఊహించలేదని, నేనెంత ఆవేదనకు గురయ్యానో మీరు అర్థం చేసుకోవాలని బాధపడ్డారు. తను సినిమాల్లో నటిస్తాను తప్ప, నిజ జీవితంలో నటించాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. దాడి చేయడం తప్పే.. నా పరిస్థితి.. సందర్భాన్ని అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు. గేటు బయట కొట్టి ఉంటే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చన్నారు. ఆయన ఇంట్లోకి వచ్చి ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారని, తన తనయుడే తన ప్రశాంతతను చెడగొడుతున్నాడని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, అవన్నీ మరచిపోయి కొట్టిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారని వ్యాఖ్యానించారు. మీకు ఛానల్స్ ఉండొచ్చు.. తను కూడా రేపు ఓ ఛానల్ పెట్టొచ్చు అని అభిప్రాయపడ్డారు.






