12-07-2025 01:10:14 AM
నల్లగొండ టౌన్, జూలై 11: మద్యం వ్యాపారులను అబ్కారీ శాఖ పీల్చి పిప్పి చేస్తూ అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారని విమర్శలు జోరుగా ఉన్నాయి. ఏ వ్యాపారిని అడిగిన అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు చెబుతుంటారు. వాళ్ల ఇబ్బందులు కష్టాలు అధికారులకు అవసరం లేదు .
వైన్స్ యాజమానుల నుంచి బలవంతంగా వసూలు చేసుకోవడం మాత్రం తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికారులు అడిగింది ఇవ్వకపోతే ఇక వైన్స్ యజమానికి తిప్పలు తప్పవు. అందుకే వాళ్లు అడిగిందే తడవుగా అన్ని పనులు చక్కబెట్టి పంపిస్తారనే ఆరోపణలు లేకపోలేదు.
ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 336 మద్యం దుకాణాలు ఉన్నాయి. అంతేగాకుండా 56 బార్, రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 155 మద్యం దుకాణాలు, సూర్యాపేట జిల్లాలో 99, యాదాద్రి భువనగిరి 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రతి ఏడాది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నుంచి వైన్స్లను రెన్యువల్ చేసుకోవాలి. రెండేళ్లకు ఒకసారి దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేసి డ్రా పద్ధతి ద్వారానే దుకాణాల ఎంపిక జరుగుతుంది.
ప్రతి వైన్స్ నుంచి జబర్దస్త్ వసూల్..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్స్ల నుంచి పెద్దఎత్తున వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రతినెలా ఒక వైన్స్ నుంచి రూ. 23వేలు, బార్ నుంచి రూ.20వేలు జబర్దస్త్గా వసూలు చేస్తున్నారని తెలిసింది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 336 వైన్స్ల నుంచి దాదాపు రూ.80లక్షలు, 56 బార్ల నుంచి రూ.20వేలు చొప్పున దాదాపు రూ.36 లక్షలు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వైన్స్, బార్ల నుంచి రూ.1 కోటికి పైగానే వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం.
వసూళ్ల సొమ్ము పంపకం ఇలా...
ఇదిలాఉంటే ప్రతి వైన్స్ నుంచి రూ. 23వేలు, స్థానికంగా ఉన్న ఎక్సైజ్ పోలీసు అధికారులు వసూళ్లు చేస్తారని సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 90లక్షల వసూళ్లు చేస్తారని సంబంధిత శాఖలోనే జోరుగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ వసూలు చేసిన సొమ్ములో ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉన్న ఓ అధికారికి రూ.2500, ఆ తర్వాత స్థాయి అధికారికి రూ.2వేలు, విభజన జిల్లా స్థాయి అధికారికి రూ.3వేలు, మరో అధికారికి రూ.1500ల చొప్పున మొత్తం రూ.9వేలు పైఅధికారుల జేబుల్లోకి వెళతాయని సమాచారం.
మిగతా రూ.14వేలలో 40శాతం స్టేషన్లో ఉండే అధికారికి, రెండో అధికారికి 30శాతం, పంపకాలు చేసుకోగా మిగతా సొమ్మును క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇదే పద్ధతిలో ఉమ్మడి జిల్లాలోని 56 బార్ల నుంచి సుమారు రూ .11లక్షలకు పైగా వస్తున్న సొమ్మును సైతం అలాగే పంపకాలు చేసుకుంటారని తెలుస్తోంది.
ఇలా వసూలు చేస్తున్న అక్రమాల పట్ల వైన్స్ యాజమాన్యం ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని మద్యం దుకాణాల యజమాన్యాలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం.