21-06-2025 10:13:57 PM
- పినపాక శాసనసభ్యులు పాయం ప్రత్యేక శ్రద్ధ వృధా
- ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో రోడ్డు కొలతలోకి పలు వ్యాపారాలు
- తూతు మంత్రంగా నోటీసులు ఇచ్చి చోద్యం చూస్తున్న పంచాయతీ రాజ్ శాఖ
- పోలీసుల కేసులకు సైతం భయపడని వాహనదారులు
పినపాక (విజయక్రాంతి): పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటిరోజే పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించారు. డిపిఓ, డి ఎల్ పి ఓ, మణుగూరు డిఎస్పీతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని డ్రైనేజీ వరకు రోడ్డు ఆక్రమిత విస్తరణ పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో డిఎల్పిఓ సుధీర్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక ఎంపీఓ వెంకటేశ్వరరావు, అప్పటి సీఐ శివప్రసాద్, అప్పటి ఎస్ఐ వెంకటప్పయ్య ఆధ్వర్యంలో గత సంవత్సర క్రితం రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వరకు రహదారి ఆక్రమిత భాగాన్ని తొలగించి మార్కింగ్ చేశారు.
మేడారం సమయంలో సైతం ఒక ప్రమాదం జరగకుండా ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ పనులు చేయించారు. ఎంపీఓ వెంకటేశ్వరరావు రాత్రి పగలు తేడాలేకుండా రోజులో 15 గంటలు ఇక్కడే ఉండి సుమారు పదిరోజుల పాటు పనులు చేశారు. ఇప్పుడు ఆ శ్రమ వృధా అయినట్టుగా కనిపిస్తుంది. కొద్దిరోజులు రోడ్డు ఆక్రమిత భాగాల్లోకి వస్తే పంచాయతీ సెక్రెటరీలు నోటీసులు ఇచ్చారు తప్ప చర్యలు మాత్రం తీసుకోలేదు. దీనితో మళ్లీ యధా రాజా తథా ప్రజా అన్న విధంగా ఈ బయ్యారం క్రాస్ రోడ్ తయారయింది. అధికారులు పట్టించుకుందామంటే రాజకీయ కారణాలు అడ్డు వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పనిచేసే అధికారులు సైతం పని చేయలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. కనీసం రెండు లారీలు వస్తే తప్పుకునే పరిస్థితి సైతం ఇక్కడ లేదు. ప్రమాదాలు జరిగి చిన్న చిన్న గాయాలు అయ్యే పరిస్థితి నిత్యం జరుగుతూనే ఉంది.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేసిన శ్రమ, కృషి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఎమ్మెల్యే ఆదేశాలను సైతం పట్టించుకోని పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదమే తప్పింది. ఒక లారీ ఆటోను ఢీకొంది . ఆ ఆటో రెండు బైకులను ఢీకొంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. మునుముందు పెను ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు అనే పరిస్థితి సామాన్యుడిలో సైతం వ్యక్తం అవుతుంది. పోలీస్ శాఖ వారు దీనిపై దృష్టి పెట్టి ప్రతిరోజు రోడ్డు కొలతలో నిలుపుదల చేసిన వాహనాలపై, ఆక్రమిత భాగంలోకి వచ్చిన దుకాణాలపై కేసులు నమోదు చేస్తే తప్పకుండా ఈ పరిస్థితి మారే అవకాశం లేదు.
ప్రాణాలు పోకముందే పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని పలువురు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. నిత్యం వేలాదిమంది ఈ రహదారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మణుగూరు టు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఒకవైపు వాహనాల రద్దీ, మరోవైపు ఇసుక లారీలు బొగ్గు లారీల రద్దీ అధికంగానే ఉంటుంది. కావున గతంలో చేసిన విధంగానే ముందుగా పటిష్టమైన చర్యలు చేపట్టి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప ప్రమాదాలు నివారణ అయ్యే పరిస్థితి లేదు దీనిపై మళ్లీ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక దృష్టి పెడితే తప్ప శాశ్వత పరిష్కారం లభించేలా లేదు.