calender_icon.png 3 August, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్లు ఇవ్వడం చేతకాకుంటే రిజైన్ చేయ్

02-08-2025 11:48:05 PM

20 నెలలుగా పింఛన్ దారులను మోసం చేస్తున్న సర్కారు

ఆగస్టు 31 నుంచి పెంచిన మొత్తం ఇవ్వాల్సిందే

సీఎం రేవంత్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఫైర్

చేవెళ్ల: ప్రభుత్వం 20 నెలలుగా పింఛన్ దారులను మోసం చస్తోందని, పెంచిన పింఛన్లు ఇవ్వడం చేతకాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ  సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆగస్టు 13 నుంచి పెంచిన పింఛన్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శనివారం చేవెళ్లలో ని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన  వికలాంగుల, చేయూత పింఛన్ దారుల మహా గర్జన సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు వికలాంగులకు రూ.6 వేలు, వృద్ధులకు రూ. 4 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ... అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెంచిన పింఛన్లు ఇవ్వకపోవడంతో ప్రతి పింఛన్ దారు ఇప్పటివరకు రూ. 40 వేలు నష్టపోయారని వాపోయారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు కొత్తగా  5 లక్షలు పింఛన్లు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో  సీఎం చంద్రబాబు నాయుడును  పింఛన్లు పెంచాలని అడగగా  వృద్ధులు, వితంతువులకు రూ. 4 వేలు,  వికలాంగులకు రూ.6 వేలు ఇస్తున్నారని గుర్తుచేశారు.   కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల కోట్లు రైతు రుణమాఫీకి కేటాయించివదని, అది ముమ్మాటికి పింఛన్ దారుల సొమ్మేనని స్పష్టం చేశారు. 

పింఛన్ల కోసం ఉద్యమాలు చేస్తుంది ఎమ్మార్పీఎస్సే..

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ భూస్వాముల కుటుంబాల్లో పుట్టిన వారని, తాను మాత్రమే పేదింటి బిడ్డగా  పింఛన్ల కోసం అనేక ఉద్యమాలు చేశానని చెప్పారు.  18 ఏండ్లుగా వికలాంగుల కోసం, 12 ఏండ్లుగా వృద్ధులు, వితంతుల కోసం, పేదలకు  గుండె ఆపరేషన్ల కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో  పోరాటారు చేస్తున్నామని స్పష్టం చేశారు.   తల్లిదండ్రులను పట్టించుకోని వారికోసం తాను పెద్ద కొడుకుగా  అండగా ఉన్నానని గుర్తుచేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులే కాదు చేయూత పరిధిలోకి వచ్చే బీడీ కార్మికులు, గీత కార్మికులు, కండరాల క్షీణత, హెఐవీ, డయాలసిస్, బోదకాల వ్యాధిగ్రస్తులకు కూడా పెంచిన పిఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే   ఆగస్టు 13న హైదరాబాద్ మహానగరంలో  మహా గర్జన నిర్వహిస్తున్నామని, దీన్ని  విజయవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో సన్నాహక సదస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.