02-08-2025 11:44:17 PM
తాగునీటినందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే - డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
కెసిఆర్ వల్లే తాగునీటి సమస్య పరిష్కారం-మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పాలాభిషేకం
మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి బిఆర్ఎస్ జలాభిషేకం
గజ్వేల్: కాలేశ్వరంలో భాగమైన సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు అధికారులు తాగునీటి సరఫరాను ప్రారంభించారు. ఇప్పటివరకు సిద్దిపేట, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన 870 గ్రామాలకు అధికారులు మలన సాగర్ నుండి తాగునీటిని సరఫరా చేశారు. నేటి నుండి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలలోని 450 గ్రామాలతోపాటు గజ్వేల్ పరిధిలోని మల్లన్న సాగర్ ఆర్అండ్ఆర్ కాలనీకి కూడా తాగునీటి సరఫరాను ప్రారంభించారు. గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గాలతో పాటు మల్లన్న సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీకి తాగునీటిని సరఫరా చేయడానికి మల్లన్నసాగర్ నుండి ప్రతిరోజు 104 మిలియన్ లీటర్ల వీటిని వినియోగిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో హైదరాబాద్ కు కూడా వలన సాగర్ జలాల ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి అధికారులు పనులు కొనసాగిస్తున్నారు.
తాగునీటి ఘనత మాదేనంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ పోటాపోటీ అభిషేకాలు
గజ్వేల్ నియోజకవర్గానికి తాగునీరు అందిస్తున్న ఘనత మాదంటే మాదేనని కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణులు పోటీపడ్డాయి. మల్లన్న సాగర్ నుండి మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా నేటి సరఫరా కోసం 2021లో పనులు ప్రారంభం కాగా కోవిడ్, ధరల పెరుగుదలతో పెండింగ్లో ఉన్న పనులు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నేటికీ పూర్తయి నీటి సరఫరా ప్రారంభమైంది. కాగా గజ్వేల్ ప్రజల తాగునీటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని అప్పటి ముఖ్యమంత్రి వైయస్సార్ గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టగా, ఆ నీటిని మళ్లించి దానిని తన గొప్పగా చెప్పుకొని కేసీఆర్ ప్రచార ఆర్భాటం చేసినట్లు డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే జీఓ 433 ద్వారా రూ 210 కోట్లు కేటాయించి గజ్వేల్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా ప్రారంభం కావడంతో కోమటిబండ మిషన్ భగీరథ సంప్ హౌస్ వద్ద తుంకుంట నర్సారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చొరవతోనే గజ్వేల్ నియోజకవర్గానికి మల్లన్న సాగర్ గోదావరి జలాల ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుందని బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి గజ్వేల్ బిఆర్ఎస్ శ్రేణులతో కలసి జలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.1410 కోట్లు ఖర్చుపెట్టి మల్లన్న సాగర్ నుండి మంగోల్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేసి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గలకు శాశ్వతంగా మంచినీటి సమస్యను దూరం చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. ప్రాజెక్టులో మిగిలిన చిన్న చిన్న పనులు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు కాలయాపన చేసి నెల రోజులుగా సరిగ్గా తాగునీటిని సరఫరా చేయలేక పోయిందన్నారు.