నల్లగొండ, కరీంనగర్ @46 డిగ్రీలు
అగ్నిగుండంగా రాష్ట్రం
మే నెలలో 49 డిగ్రీల వరకు ఎండలు
మరో 5 రోజులు ఇదే పరిస్థితి
వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగు తున్న ఉష్ణోగ్రతలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాలుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు (40 నుంచి 45 డిగ్రీలు )నమోదువుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది. ఉదయం 9 గంటల నుంచే భాను డు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 వరకు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రకటించింది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ముందే తెలిపింది.
వేడిగాలులు తీవ్రత
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ అత్యంత వేడి నెలగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో ౫ రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ పేర్కొం ది. దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్పంలో తీవ్రమైన వేడిగాలుల ప్రభా వం ఉంటుందని స్పష్టం చేసింది. బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఓడిశాలోని కొన్ని ప్రాంతాలలో వడగాలులు వీచే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఓడిశా, బీహార్, రాయలసీమ వంటి ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్ ప్రమాదం కలగనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హిమాలయ పర్వత ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజుల్లో అత్యధికంగా 41 నుంచి 43 వరకు, అత్యల్పంగా 27 నుంచి 29 వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని, రానున్న మూడు రోజులు నగరంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.
అవసరమైతేనే బయటికి..
వృద్దులు, చిన్నపిల్లలపై ఉష్ణోగ్రతలు అధిక ప్రభావం చూపుతాయని ఉదయం 11 గంటల నుంచి 4.30 గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే సాయంత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తలపై ఎండ పడకుండా ఉండేందుకు గొడుగు, లవణాలు కోల్పోకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ నీళ్ళను వెంట తీసుకెళ్ళాలని సూచిస్తున్నారు. ఎండ దెబ్బ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుతో పాటు ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత వరకు ప్రయాణం మానుకోవాలని, కాంక్రీట్ నేలపై పడుకోవద్దని తెలిపింది.




