ఓయూ ప్రతిష్ఠకు కాంగ్రెస్ దెబ్బ
బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపణ
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాం తి): ఉస్మానియా విశ్వవిద్యాలయం వంద సంవత్సరాల ప్రతిష్ఠను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. విద్యుత్, తాగునీరు సరఫరా చేయలేమని విద్యార్థులు ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని దుయ్యబట్టారు. వైస్చాన్స్లర్ అను మతి లేకుండా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ నోటీసులు ఎలా ఇస్తారని, దీనిపై ప్రభుత్వానికి అవగాహన లేదని మండిపడ్డారు. కేసీఆర్ స్పందించిన తర్వాత చీఫ్ వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇచ్చారని, చిన్న అధికారిపై నెపం వేసి చేతులు దులుపుకొనే ప్రయ త్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. యూనివర్సిటీలో కరెంటు, నీళ్లు ఉన్నాయంటూ డిప్యూటీ సీఎం గొప్పలు చెప్పు కొంటున్నారని, అయితే ఈ సంఘటనతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని చెప్పారు. ఇక, కాంగ్రెస్ వచ్చి కరువు తీసుకొచ్చిందని విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. మార్పు అంటే కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ మాదిగలను చిన్నచూపు చూస్తోందని, ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, టికెట్ ఇవ్వలేదని, పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలు పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు. వర్సిటీ విద్యార్థులంతా ఏకమై ప్రభుత్వ కుట్రలు తిప్పికొట్టాలని, నిరుద్యోగ భృతి మ్యానిఫెస్టోలో పెట్టిన సంగతి భట్టికి తెలియనట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.




