24-06-2025 12:37:02 AM
కుబేర సక్సెస్ మీట్లో చిరంజీవి
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ’కుబేర’. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. అగ్ర నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఉన్నవాళ్లంతా నాకు కావలసిన వాళ్లు. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తోంది. నాగార్జున ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశారు. కుబేర గురించి అడిగాను. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను.. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు.
ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను. నాకు ఎక్కడో డిఫరెంట్ గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది అలా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పారు. నేను సినిమా చూశాను. ఆయన చెప్పినది 100 శాతం కరెక్ట్. ఈ సినిమా తర్వాత తను మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూశాను. వాస్తవంగా జరుగుతున్నట్టుగా అనిపించింది.
ఒక్కొక్క సినిమాని ఆణిముత్యం లాగా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నా శేఖర్ కమ్ముల. ఇలాంటి ఆణిముత్యాల లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న దర్శకుడిగా ఆయన ఉండడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. నాగ్ అనుకున్నట్లుగా ఇది ఆయనకి మరో డోర్ ఓపెన్ అయింది.
మరిన్ని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఆయనకి వస్తాయి. ఆయన తోవలో కూడా నేను వస్తానని అనుకుంటున్నాను. రష్మిక నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. దేవ క్యారెక్టర్ కి ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్ని గుర్తించలేకపోయాను.
అంతలా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం.’ అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. ‘సపోర్ట్ చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. థ్రిల్లర్ తో హ్యూమన్ ఎమోషన్ తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఈ సినిమాతో కుదిరింది. ఇట్స్ బిలాంగ్స్ టు శేఖర్ కమ్ముల.. ఆయనకి థాంక్యూ.
నాకు తెలియని యాక్టింగ్ ఏదో ఇందులో నేర్పించారు (నవ్వుతూ). నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిరోజు కొత్తగా ఉండేది. చిరంజీవి వచ్చేటప్పుడు కార్లో చెప్పారు.. ’చాలా బాగా చేశావు దీపక్ అయిపోయావు’ అన్నారు. అప్పుడు నాకు శేఖర్ కమ్ముల గొప్పతనం అర్థమైంది.
ధనుష్ ని సెట్ లో అసలు పోల్చుకోలేకపోయా. సినిమా అంతా దేవా క్యారెక్టర్ లోనే ఉన్నారు. అలా ఉండడం అంత ఈజీ కాదు. రష్మికని చూస్తే క్షణక్షణం లో శ్రీదేవి గారి గుర్తుకొచ్చారు. ఈ సినిమాలో తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ సినిమా నాలు వరల్ ని ఓపెన్ చేసింది. మరో 40 ఏళ్ళు తిరుగుండదు‘ అన్నారు.
హీరో ధనుష్ మాట్లాడుతూ .. ‘ఇది ఒక అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు కోసమే ప్రతి ఆర్టిస్ట్ ఎదురుచూస్తారు. ఇలాంటి రోజుల్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక సినిమాకి యునానిమస్ గా అద్భుతమైన రెస్పాన్స్ రావడం అనేది చాలా అరుదు. యాక్షన్, బ్లాస్టింగ్స్ ఉన్న సినిమాలే థియేటర్స్ లో ఆడుతున్నాయని, అలాంటి సినిమాలకే థియేటర్స్ జనాలకి వస్తున్నారని ఒక వాదన ఉంది. కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. హార్ట్ ఫుల్ గా సినిమా తీస్తే ఆడియన్స్ ని ధియేటర్స్ కి తీసుకురావచ్చు అనే హోప్ ని ఆయన ఇచ్చారు’ అన్నారు.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. చిరంజీవి నా లక్కీ చార్మ్. ఆయన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కాలేజ్ డేస్ లో ఆయనని కలిసాను. షేక్ హ్యాండ్ ఇచ్చాను ఆయన్ని డైరెక్ట్ చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి మొదలైన జర్నీ 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన్ని మొన్న కలిసాను. అక్కడి నుంచి ఈ సినిమాకి ఒక యుఫోరియా స్టార్ట్ అయింది.
చిరంజీవి ఎప్పుడు కూడా బయట వ్యక్తిలా అనిపించరు. కుబేర కి ఆడియన్స్ ఇచ్చిన స్థానాన్ని స్థాయిని మర్చిపోలేను. ఒక ఫిలిం మేకర్ కి గొప్ప బలాన్ని ఇచ్చారు. చాలా పెద్ద కాన్వాస్ లో తీసిన సినిమా ఇది. నాగార్జున క్యారెక్టర్ కు రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఆయన పర్ఫామెన్స్ ని చూస్తున్నప్పుడు నాకే కళ్ళల్లో నీరు తిరిగాయి. ధనుష్ గురించి ఒకటే మాట చెప్పాలి.. గాడ్ లైక్ పెర్ఫార్మెన్స్. పోయిరా మామ సాంగ్ చూసి నాకే పూనకాలు వచ్చాయి.’ అన్నారు.
హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘ఈ కథ విన్న తర్వాత సెట్స్ వెళ్లి డైరెక్టర్ కి సరెండర్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాను. ఆయన ఎలా చెబితే అలా పెర్ఫార్మ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు సమీర పాత్రకు వచ్చిన క్రెడిట్ డైరెక్టర్ కే దక్కుతుంది. ఇలాంటి క్యారెక్టర్ రావడం నా అదృష్టం‘ అన్నారు. నిర్మాతలు పుష్కర్ రాం మోహన్, జాహ్నవి నారంగ్ పాల్గొన్నారు.