calender_icon.png 23 August, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి జీవనమే పరమౌషధం

16-06-2024 12:05:00 AM

గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్  స్థాపించి యాభయ్ సంవత్సరాలవుతున్నది. ప్రకృతి వైద్యం ఒక జీవన విధానం అని గ్రహించి చాలామంది రోగులు ఇక్కడ చేరుతున్నారు. రెండు రాష్ట్రాలకు ఇదొక్కటే ప్రకృతి చికిత్సాలయం. ఇక్కడ ‘బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి’ కోర్సు మొదలుపెట్టి 35 సంవత్సరాలవుతోంది. పీజీ కోర్సుకు ఇంతవరకు మోక్షం లేదు. పీజీ, రీసెర్చ్ కోర్సులు ప్రవేశపెట్టి ప్రకృతి వైద్యానికి జీవం పోయాలి.  

ప్రకృతి వైద్యం అనేది మానవుడు సామరస్యంగా, ప్రకృతి నిర్మాణాత్మక సూత్రాలతో, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దశలలో అతని జీవితంలో రూపొందించుకునే ఒక విధానం. ఇది ఆరోగ్యాన్ని పెంపొందించే, వ్యాధులను నివారిస్తూ, అవసరాన్నిబట్టి చికిత్సతో స్వస్థతను కలిగిస్తుంది. అలాగే, శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగి యథాస్థితికి తీసుకు రాగలిగే గొప్ప అవకాశాలను ఈ వైద్య విధానం కలిగి ఉంది.  ‘బ్రిటిష్ నేచురోపతి అసోసియేషన్’ ప్రణాళికా ప్రకటన ప్రకారం ‘ప్రకృతి వైద్యం’ (నేచురోపతి) అనేది శరీరంలో అంతర్లీనంగా ఉండే, స్వస్థతను కలిగించే శక్తి ఉనికిని గుర్తించి చేసే చికిత్సా విధానం. అందువల్ల, ఇది వ్యాధిని కలిగించే కారణాలు అంటే ఉపయోగించే పదార్థాలలో విషపూరితాలను తొలగించడానికి, అవాంఛనీయ పదార్థాలను శరీరం నుండి విసర్జింపజేసి, వ్యాధులను నయం చేయడానికి శరీర వ్యవస్థకు సహకరిస్తుంది.

అన్ని వ్యాధులు, వాటి కారణాలు చికిత్సలు ఒకటే. బలమైన దెబ్బలు, గాయాలకు పర్యావరణ పరిస్థితులకు తప్ప, అన్ని రోగాలకూ కారణం ఒకటే. అది శరీరంలో అనారోగ్యకరమైన పదార్థాలు పేరుకు పోయి ఉండడమే. వ్యాధులన్నింటికీ చేసే చికిత్స శరీరంలోంచి పేరుకుపోయిన పదార్థాలను తొలగించి వేయడం. బ్యాక్టీరియా (మేలు లేదా కీడు చేసే సూక్ష్మజీవులు), వైరస్ (విషక్రిములు), వాటికి పెరగడానికి అనువైన అనారోగ్యకరమైన పదార్థాలు నిండుకోవడం వల్ల అవి శరీరంలోకి ప్రవేశించి అక్కడే జీవిస్తూ ఉంటాయి. తీవ్ర వ్యాధులు ఒక రకంగా శరీర స్వయంకృషితో నయమవుతుంటాయి. దీర్ఘకాల వ్యాధులకు మూలం తప్పుడు చికిత్స లేదా తీవ్ర వ్యాధులను అణగదొక్కి ఉంచడం వల్ల సంభవించిన ఫలితాలు. 

శరీరమంతటికీ చికిత్స

ప్రకృతి మహోన్నతమైన బాధలను, కష్టాలను ఉపశమింపజేసే ఉపశమనకారి. వ్యాధులను నివారించుకోగలిగే శక్తిని, అనారోగ్యంగా ఉంటే తిరిగి ఆరోగ్యాన్ని చేకూర్చుకోగల శక్తినీ మన శరీరం కలిగి వుంది. ప్రకృతి చికిత్స నయం చేయబడేది కేవలం వ్యాధి ఒకటే కాదు, వ్యాధికి గురైన రోగి మొత్తం శరీరమంతా చికిత్సను పొంది, తిరిగి యథాస్థితికి పునరుధ్దరింపబడుతుంది. దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతూ ఉండే రోగులు కూడా ప్రకృతి వైద్యంలో తులనాత్మకంగా తక్కువ సమయంలో  విజయవంతంగా స్వస్థతకు లోనవుతారు. ప్రకృతి వైద్యంలో అణగారిన వ్యాధులు కూడా బయటకు తేబడి శాశ్వతంగా తొలగించబడతాయి. ప్రకృతి వైద్యం శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మికమైన అన్ని అంశాలనూ ఒకే సమయంలో చికిత్స చేస్తుంది. ఇది శరీరం అంతటికీ చికిత్స అందిస్తుంది. 

ప్రకృతి వైద్యం ప్రకారం ఆహారం మాత్రమే మందు, బయట ఔషధాలేవీ వాడబడవు. ఎవరి ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం వారు ప్రార్థన చేయడం అనేది చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం. ప్రకృతి వైద్య చికిత్సాలయాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్య వ్యవస్థను రూపొందించవచ్చు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను కల్పించి ప్రజలను ప్రకృతికి దగ్గర చేయాలి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు శారీరక శ్రమ తక్కువై  విపరీతంగా బరువు పెరిగారు. చాలామందికి అతిపెద్ద సమస్య స్థూలకాయం, మధుమేహం, బీపీ, కండరాలు, కీళ్ల సమస్యలు, మానసిక ఆందోళన. రోజంతా కూర్చుని, శరీరానికి ఎలాంటి పని ఇవ్వక పోవడంతో, తినే ఆహారంలో కొవ్వు పొత్తి కడుపులో చేరడం ప్రారంభిస్తుంది. ఇది కాకుండా, చెడు ఆహారం, జీవనశైలి అలవాట్లు అధిక జుట్టు రాలడానికి, చర్మం పెళుసుగా మారడానికి దారితీస్తుంది. వీటన్నింటికీ పరిష్కారం వ్యాయామం ఒక్కటే. 

బరువు తగ్గాలనుకునే వారికే కాదు, ఆరోగ్యంగా ఉండి జీవితాన్ని ఆనందంగా  పొడిగించాలనుకునే వారికి కూడా శారీరక వ్యాయామం అవసరం. రోజుకు 30 నుంచి -40 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా, చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఏ వయస్సు వారు ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి ఆహార అలవాట్లు అలవరచుకోవాలి? వ్యాయామాలు ఎలా సహాయ పడతాయి? అన్నవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.  

ప్రకృతి వైద్య చికిత్సాలయాలు ప్రతి జిల్లా కేంద్రంలో  ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు ప్రకృతి జీవనానికి దగ్గరయ్యేట్లు చూడాలి. స్వయం నియంత్రణ, మంచి ఆరోగ్య, ఆహార అలవాట్లు అవలంబించుకొనే విధంగా ప్రజలను చైతన్య పరచాలి. వ్యాధిగ్రస్తులకు, చెడు అలవాట్లకు బానిసైన వ్యక్తులకు సరైన జీవనశైలిని రూపొందించాలి. బుద్ధిమాంద్యం వున్న పిల్లలకు ఆకుపేషనల్ థెరఫీ, రీహాబిలిటేషన్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. జంక్ ఫుడ్, ఆరోగ్యాన్ని పాడు చేసే శీతల పానీయాలు, మద్య పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్ మానేయాలి. శుచి, శుభ్రతతోపాటు నాణ్యమైన తినుబండారాల పట్ల ప్రజలను నిరంతరం చైతన్య పరచడం అవసరం.

 డా. యం.అఖిల మిత్ర 

వ్యాసకర్త ప్రకృతి వైద్యులు