03-06-2025 12:59:45 AM
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ (నీట్--పీజీ)ని వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎన్బీఈఎంఎస్) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే నీట్ పరీక్ష తేదీని ప్రకటించనునట్లు వెల్లడించింది.
నీట్ పీజీ.. వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షను ఎన్బీఈఎంఎస్ నిర్వహిస్తుంది. ఇటీవల సుప్రీంకోర్టు విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు, పరీక్ష ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ఒకే షిఫ్ట్లో పరీక్షలను నిర్వహించాలని ఆదేశించగా..
పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాల లభ్యత, సమయం సరిపోదని అందుకే ఒకే షిఫ్టులో నిర్వహించలేమని ఎన్బీఈఎంఎస్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్బీఈఎ ంఎస్ నీట్-పీజీ ప్రవేశపరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. పరీక్ష కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉన్నందున పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.