14-06-2025 02:08:18 PM
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అండర్ గ్రాడ్యుయేట్స్ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష మే 4వ తేదీన జరిగింది. నీట్ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు శనివారం ఫలితాలను ప్రకటించింది. అభ్యార్థులకు స్కోర్ కార్డులు ఈమెయిల్ ద్వారా అందుతున్నాయి. లేదంటే నీట్ యూజీ పరీక్ష రాసిన అభ్యర్థులు నీట్ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో వ్యక్తిగత లాగిన్ ద్వారా తమ అప్లికేషన్ నంబర్ ను ఎంటర్ చేసి ఫలితాలను తెసుకుకోవచ్చు.
ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ నుంచి 41,584 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 36,776 మంది అభ్యర్థులు ప్రతిభ కనపరిచారు. తెలంగాణ నుంచి కాకర్ల జీవన్ సాయికుమార్ 18వ ర్యాంక్, షణ్ముఖ నిషాంత్ 37వ ర్యాంక్, మంగరి వరుణ్ 46వ ర్యాంక్, యండ్రపాటి షణ్ముఖ్ 48వ ర్యాంక్ సాధించారు. ఏపీ నుంచి దర్బా కార్తీక్రామ్కు 19వ ర్యాంక్, కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంక్ సాధించారు. దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS), బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4న ఈ పరీక్ష నిర్వహించారు. ఈ నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 20లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే.