నీట్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి
సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలి
- నీట్ నిర్వహణలో కేంద్రం వైఫల్యం
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకైంది
- విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- గాంధీభవన్ నుంచి జగ్జీవన్ రాం విగ్రహం వరకు కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ
విజయక్రాంతి నెట్వర్క్, జూన్ 21 : విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగింది. కేంద్ర విధానాలతో విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని ధ్వజమెత్తింది. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. హైదరాబా ద్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, నేతలు జగ్గారెడ్డి, అంజన్కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి కలిసి గాంధీభవన్ నుంచి జగ్జీవన్రాం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
నిర్మల్లో డీసీఈసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సూర్యాపేట జిల్లాలో విద్యార్థి సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాలలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధర్యంలో ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ సిటీలో స్టూడెంట్ మార్చ్తో కదం తొక్కారు. కేంద్రమంత్రులు స్పందించకపోతే ఇళ్లు ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, తదితరులు హెచ్చరించారు. మెదక్లో జరిగిన నిరసనలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధర్నా చేపట్టారు.






