ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.58 లక్షల కోట్లు
అంచనాల్ని మించి 18 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, మే 17: కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్ని మించాయి. బడ్జెట్లో సవరించిన అంచనాల్ని మించి రూ.19.58 లక్షల కోట్లు వసూలైనట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో 2023 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని రూ.19.45 లక్షల కోట్లకు పెంచుతూ సవరించింది. ఈ సవరించిన మొత్తానికి రూ.13,000 కోట్లు అధికంగా ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల నికర వసూళ్లు జరిగినట్టు సీబీడీటీ వివరించింది. తొలి బడ్జెట్ అంచనాలకంటే ఈ మొత్తం రూ.1.35 లక్షల కోట్లు ఎక్కువని తెలిపింది. 2023 స్థూల పన్నుల వసూళ్లు 18.48 శాతం వృద్ధితో రూ.23.37 లక్షల కోట్లకు చేరగా, రిఫండ్స్ పోను నికర వసూళ్లు 17.7 శాతం వృద్ధితో రూ.19.58 లక్షల కోట్ల వద్ద నిలిచినట్టు ప్రత్యక్ష పన్నుల శాఖ తెలిపింది. అంతక్రితం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.16.64 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2023 బడ్జెట్లో తొలుత రూ.18.23 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, తదుపరి దీనిని రూ.19.45 లక్షల కోట్లకు సవరించారు.
భారీగా పెరిగిన వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయాల వృద్ధిని సూచిస్తూ ఆ పన్నుల నికర వసూళ్లు భారీగా 25.23 శాతం పెరిగి రూ.10.44 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.8.33 లక్షల కోట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు నమోదయ్యాయి.






